సోషల్ సైట్లలో మైనర్ పిల్లల పేరిట పేరెంట్స్ అకౌంట్లు తెరిస్తే ఫేక్
ముంబై: సామాజిక అనుసంధాన వేదికల్లో తన మైనర్ పిల్లల పేరిట తల్లిదండ్రులు అకౌంట్ తెరివవద్దని బాంబే హైకోర్టు పేర్కొంది. పుణేకు చెందిన ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తె పేరిట సోషల్ మీడియా అకౌంట్లను ప్రారంభించాడు. ఈ వ్యవహారంలో కోర్టు పై వ్యాఖ్యలు చేసింది.
మైనర్ పిల్లల పేరిట అకౌంటును పెద్దవారు ప్రారంభిస్తే అది నకీలు అకౌంట్ అవుతుందని జస్టిస్ మృదులా భట్కర్ పేర్కొన్నారు. పద్దెనిమిది ఏళ్లు నిండిన వ్యక్తులు కాకపోతే అకౌంట్ న్యాయసమ్మతం కాదన్నారు. వేరుగా ఉంటున్న భార్య పేరిట తెరిచిన సోషల్ మీడియా అకౌంటును కూడా డిలీట్ చేయాలని సదరు వ్యక్తిని ఆదేశించారు.
కుమార్తె, భార్య పేరిట సామాజిక అనుసంధాన వేదికల్లో అకౌంట్లు ఇక మీదట ప్రారంభించవద్దని ఆదేశించింది. పుణేకు చెందిన సదరు వ్యక్తి భార్య నుండి విడాకులు తీసుకున్నాడు. ఆ బాలిక తల్లి వద్దే ఉంటోంది. దీంతో, తన మైనర్ కుమార్తెను గత ఏడాది జనవరి నెలలో తనకు అప్పగించాలని హైకోర్టును ఆశ్రయించాడు.
బాలిక తల్లి మాత్రం.. ఆ వ్యక్తి వద్దకు వెళ్లడం తన కుమార్తెకు ఇష్టం లేదని, అతని వద్ద ఆ బాలిక సౌకర్యవంతంగా ఉండలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసు విచారణలో భాగంగా సోషల్ మీడియా అకౌంట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది.