పిల్లాడి పాలిట పిశాచాలు: మూడేళ్ల చిన్నారిపై తల్లిదండ్రుల దాష్టీకం..బాలుడి పరిస్థితి విషమం
తిరువనంతపురం: కేరళలో చిన్నారులపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. చిన్నారులపై కన్నవారే దాడి చేస్తుండటం విశేషం. తొడుపుజలో కొద్ది రోజుల క్రితం ఓ ఏడేళ్ల చిన్నారిని తన తల్లికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి చితకబాదటంతో మృతి చెందిన విషయం మరువక ముందే మరో ఘటన వెలుగు చూసింది. మూడేళ్ల బాలుడిపై తల్లిదండ్రులు చేయిచేసుకోవడంతో ఆ చిన్నారి మెదడు నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.
తన కొడుకు క్రమశిక్షణ తప్పడంతోనే తాను కొట్టినట్లు ఒప్పుకుంది తల్లి. చిన్నారి అల్లరి చేస్తుండటంతో సహనం కోల్పోయి విపరీతంగా కొట్టినట్లు తల్లి పేర్కొంది. తల్లితో పాటు తండ్రి కూడా బాలుడిపై చేయి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 307, 75 నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. తల్లి జార్ఖండ్కు చెందినదని తండ్రి పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి అని చెప్పిన పోలీసులు కేరళకు ఉద్యోగం వేటలో కేరళకు వచ్చినట్లు తెలిపారు. బాలుడి తల్లిదండ్రులు పనిచేస్తున్న కంపెనీలో విచారణ చేసిన పోలీసులు వారిని తీసుకొచ్చి పనిలో పెట్టిన ఏజెన్సీని కూడా విచారణ చేశారు.
తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన బాలుడికి ప్రస్తుతం వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. బుధవారం రాత్రి రక్తస్రావం ఆగకపోవడంతో సర్జరీ చేశారు వైద్యులు. పరిస్థితి విషమించడంతో బాబు ప్రాణాలను కాపాడేందుకు తమ శక్తిమేరా ప్రయత్నిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి క్షేమంగా మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని తాను నివాసం ఉంటున్న కాలనీవాసులు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.