టీవీ చూస్తున్న తల్లిదండ్రులు, నీటి సంప్ లో పడి చిన్నారి మృతి, సుజిత్ ప్రోగ్రామ్ !
చెన్నై: తమిళనాడులోని తుత్తూకుడి జిల్లా త్రేస్ పురానికి చెందిన లింగేశ్వర్, నిషా దంపతులకు రేవతి అలియాస్ సంజనా (2) అనే కుమార్తె ఉంది. రాత్రి లింగేశ్వర్, నిషా దంపతులు ఇంటిలో కుర్చుని బోరు బావిలో పడిన సుజిత్ (2) అనే బాలుడిని రక్షించే దృశ్యాలను టీవీలో చూస్తున్నారు. ఆ సమయంలో ఇంటిలోనే ఉన్న రేవతి ఆడుకుంటూ ఇంటి బయటకు వెళ్లింది.
రేవతి ఇంటి బయటకు వెళ్లిన విషయం లింగేశ్వర్, నిషా దంపతులు గమనించలేదు. టీవీ చూస్తూ లింగేశ్వర్, నిషా దంపతులు ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయారు. ఇంటి బయట ఉన్న నీటి సంప్ మీద ఎలాంటి మూత లేకపోవడంతో అటు వైపు ఆడుకుంటూ వెళ్లిన రేవతి అందులో పడిపోయింది.
Recommended Video
ఏ పాపం తెలియని రేవతి కేకలు వెయ్యలేక నీటిలో మునిగిపోయింది. టీవీలో ప్రోగ్రామ్ అయిపోయిన తరువాత లింగేశ్వర్, నిషా దంపతులు కుమార్తె రేవతి కనపడటం లేదని ఆందోళనకు గురైనారు. చుట్టుపక్కల రేవతి కోసం గాలించారు.
చివరికి అనుమానం వచ్చి నీటి సంప్ లో గాలించగా రేవతి సృహ తప్పిపడిపోయిన విషయం గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మరణించిదని వైద్యులు చెప్పడంతో లింగేశ్వర్, నిషా దంపతులు ఆర్తనాదాలు చేశారు.
బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్ (2)ని రక్షించే దృశ్యాలను తాము టీవీలో చూస్తున్నామని, అదే సమయంలో ఆడుకుంటున్న చిన్నారి రేవతి బయటకు వెళ్లి నీటి తొట్టిలో పడి మరణించిదని లింగేశ్వర్, నిషా దంపతులు ఆర్తనాదాలు చేశారు. తమిళనాడులో బోరు బావిలో పడి సుజిత్ విల్సన్ మరణించిన వార్త మరచిపోక ముందే రేవతి అనే చిన్నారి నీటి తొట్టిలో పడి మరణించిన వార్త బయటకు రావడంతో లక్షలాది మంది చలించిపోయారు.