పరీక్షా పే చర్చ: విద్యార్థులతో ప్రధాని ముచ్చట్లు.. ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ గురించి మోడీ
Recommended Video
న్యూఢిల్లీ: విద్యార్థులకు పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ వారితో ముచ్చటించారు. పరీక్షా పే చర్చ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. గత వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకు విజయం వైపు అడుగులు వేసేందుకు ప్రయత్నించాలని ఆయన విద్యార్థులకు చెప్పారు.
చంద్రయాన్ గురించి ప్రస్తావించిన ప్రధాని
పరీక్షా పే చర్చ మూడవ ఎడిషన్లో భాగంగా ప్రధాని మోడీ విద్యార్థులతో మాట్లాడారు. గతేడాది భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 మిషన్ విఫలమైందని గుర్తు చేసిన ప్రధాని మోడీ... ఆ ప్రయోగం చాలా క్లిష్టమైనదని విజయవంతం అవుతుందో లేదో తెలియదని అలాంటప్పుడు మిషన్ లాంచ్ కార్యక్రమానికి వెళ్లకపోవడమే మంచిదని పలువురు సూచించినట్లు మోడీ చెప్పారు. విఫలమైతే ఏమౌతుంది అని తాను వారికి ఎదురు ప్రశ్న వేసినట్లు చెప్పి నెల్లూరు జిల్లా శ్రీహరికోటకు వెళ్లినట్లు ప్రధాని చెప్పారు. చంద్రయాన్-2 విఫలం చెందడంపై తాను కూడా ఎంతో బాధపడినట్లు చెప్పిన ప్రధాని .... ఈ మిషన్ కోసం కఠోరంగా శ్రమించిన శాస్త్రవేత్తల దగ్గరకు వెళ్లి వారిని ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పినట్లు ప్రధాని మోడీ గుర్తుచేశారు.
శాస్త్రవేత్తల్లో ధైర్యం నింపినట్లు చెప్పిన ప్రధాని
వారు చేసిన శ్రమ ఎంలో అమూల్యమైనదని వారిని కొనియాడినట్లు ప్రధాని చెప్పారు. ఈ మాటలతో వారిలో కొత్త ఉత్తేజంను నింపినట్లు చెప్పారు. భారతదేశం మీ వెన్నంటే ఉంటుందని చెప్పినప్పుడు శాస్త్రవేత్తలు విఫలమైన చంద్రయాన్-2 మిషన్ బాధ నుంచి బయటపడ్డారని వారిలో తెలియని ధైర్యం కనిపించిందని ప్రధాని మోడీ అన్నారు. తాను చెప్పిన మాటలు ఒక్క శాస్త్రవేత్తలకే కాదు యావత్ భారత దేశం మూడ్ను మార్చివేసిందని ప్రధాని మోడీ విద్యార్థులతో చెప్పారు. ఆ తర్వాత ఏమి జరిగిందో మీకందరికి తెలుసని అన్నారు. వైఫల్యాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చని విద్యార్థులతో ప్రధాని మోడీ చెప్పారు.
2001 భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్
ఇక 2001లో జరిగిన భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ను కూడా ప్రధాని మోడీ విద్యార్థులతో ప్రస్తావించారు. ఆ సమయంలో స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడ్డారని అయినా సరే భారత్ విజయం కోసం కష్టపడి అనుకున్న విజయాన్ని కట్టబెట్టాడని గుర్తుచేశారు. సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కొంటామన్న దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయని ప్రధాని మోడీ విద్యార్థులతో చెప్పారు. అంతేకాదు ఆ మ్యాచ్లో రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ల గురించి కూడా ప్రధాని చెప్పారు. భారత విజయావకాశాలు సన్నగిల్లిన సమయంలో ద్రవిడ్, లక్ష్మణ్ నెలకొల్పిన అధ్భుతమైన భాగస్వామ్యం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. ఇలా పాజిటివ్గా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే విజయాలు వాటంతటికవే వస్తాయని విద్యార్థులో ప్రధాని దైర్యం నింపారు.
విద్యార్థులకు చిట్కాలు ఇచ్చిన ప్రధాని
విద్యార్థులు ముఖ్యంగా పదవ తరగతి, 12వ తరగతి స్టూడెంట్స్ మరికొన్ని రోజుల్లో బోర్డు ఎగ్జామ్స్ రాయనుండగా వారిలో ఉన్న ఆందోళన భయాన్ని తొలగించే భాగంగా ప్రధాని ప్రతి ఏటా విద్యార్థులతో ముచ్చటించడం జరుగుతోంది. అంతేకాదు పరీక్షలంటేనే ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కొన్ని చిట్కాలను కూడా ప్రధాని మోడీ పంచుకున్నారు. దేశవ్యాప్తంగా 2వేల మంది విద్యార్థులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ప్రధానితో పరీక్షాపే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ప్రభుత్వం ఐదు టాపిక్స్పై నిర్వహించిన షార్ట్ ఎస్సేలో విజయం సాధించిన 1050 విద్యార్థులను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమంను ఇద్దరు విద్యార్థులు సమీక్షించడం విశేషం.