వచ్చే నెలలో తొలి రఫేల్ యుద్ధ విమానం: ఫ్రాన్స్ అధ్యక్షుడితో మోడీ భేటీ, కీలకాంశాలపై చర్చ
న్యూఢిల్లీ/ప్యారిస్: భారత ప్రధాని నరేంద్ర మోడీ తన రెండ్రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్తో భేటీ అవుతారు. గురువారం ప్యారిస్కు చేరుకున్న తర్వాత మాక్రోన్తో రక్షణ, పౌర అణుశక్తి, ఉగ్రవాదం, సముద్ర భద్రత వంటి అంశాలపై చర్చించనున్నారు. శుక్రవారం ఫ్రాన్స్ ప్రధాని ఎడౌర్డ్ చార్లెస్ ఫిలిప్ను మోడీ కలవనున్నారు. ప్యారిస్లోని యూనెస్కో ప్రధాన కార్యాలయంలో భారతీయులతో జరిగే కార్యక్రమంలో మోడీ ప్రసగించనున్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ
జమ్మూకాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిలో చర్చించాలని పాకిస్థాన్ పట్టుబట్టిన సమయంలో ఫ్రాన్స్.. భారత్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మాక్రోన్తో ప్రధాని భేటీ జరుగుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఫ్రాన్స్ విదేశాంగశాఖ మంత్రి జీన్ వేస్ లీ డ్రెయిన్ మంగళవారం పాకిస్థాన్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీతో మాట్లాడారు.
జమ్మూకాశ్మీర్ అంశంపైనా..
కాశ్మీర్ అంశం రెండు దేశాలకు సంబంధించినది, భారత్, పాక్ ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, జమ్మూకాశ్మీర్ అంశంపైనా మోడీ.. మాక్రోన్తో చర్చించే అవకాశం ఉంది. ఆగస్ట్ 24-26 మధ్య జరిగే జీ-7 సదస్సుకు ముందు జరిగే ఈ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తొలి రఫేల్ యుద్ధ విమానం
అంతేగాక, భారత రక్షణ వ్యవస్థలో కీలకంగా మారనున్న రఫేల్ యుద్ద విమానాల విషయంపైనా వీరి మధ్య కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సెప్టెంబర్ మూడో వారంలోనే భారత్కు ఫ్రాన్స్ నుంచి తొలి రఫేల్ యుద్ధ విమానం చేరనుంది. ఇది ఇలావుంటే, పసిఫిక్ సముద్ర తీరంపై చైనా కదలికలను గమనించేందుకు ఈ రెండు దేశాలు 8-10 ఉపగ్రహాలను అందరిక్షంలోకి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఐదేళ్లలోపే పూర్తయ్యే అవకాశం ఉంది.
కీలక ఒప్పందాలు..
ఇరు దేశాల మధ్య పలు సాంకేతిక ఒప్పందాలు కూడా చోటు చేసుకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్, వొకేషనల్ ట్రైనింగ్ అంశంపై ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. జైతాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ ప్రాజెక్ట్పై కూడా చర్చించే అవకాశం ఉంది. ఫ్రాన్స్లో భారత విద్యార్థుల సంఖ్యను పెంచే అంశంపై కూడా చర్చించనున్నారు. 2019లో 10వేల మంది విద్యార్థులు ఈ దేశం వెళ్లగా, 2020లో ఈ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించారు.