తరుణ్ విజయ్ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయసభల్లో రగడ, చర్యకు విపక్షాల పట్టు
బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. దక్షిణ భారతీయులపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన తరుణ్ విజయ్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి.
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. దక్షిణ భారతీయులపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన తరుణ్ విజయ్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు పట్టుబట్టాయి.దీంతో సభా కార్యక్రమాలు స్థంభించిపోయాయి.
దక్షిణ భారత్ లో నివసించే వారంతా దేశంలో భాగమా?కాదా? తరుణ్ విజయ్ వ్యాఖ్యలు ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి.
దేశాన్ని చీల్చాలనుకొంటున్నారా? జాత్యంహకార వ్యాఖ్యలు చేసిన బిజెపి నాయకుడిపై ఎటువంటి చర్యలు తీసుకొంటున్నారో చెప్పాలని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లేకపోతే లోక్ సభలోనే కాదు బయట కూడ ఆందోళనలను చేస్తామని ఆయన హెచ్చరించారు.అయితే విపక్షాలను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే క్షమాపణ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ఇదే విషయమై రాజ్యసభలో కూడ గొడవ జరిగింది.సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.అయితే కొంతసేపు రాజ్యసభను వాయిదావేశారు.