కరోనాతో వణుకుతున్న ఎంపీలు, మంత్రులు - పార్లమెంటు సమావేశాలు ముందే ముగింపు ?
దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న కరోనా వైరస్ పార్లమెంటు సమావేశాలను వదిలిపెట్టడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, కరోనా మార్గదర్శకాలు పాటిస్తున్నా ఎంపీలు వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులకు కూడా ఇప్పటికే కరోనా సోకడంతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో మరింత మంది ఎంపీలకు కరోనా సోకకుండా ప్రభుత్వం రేపో మాపో వర్షాకాల సమావేశాలను గడువులోపే ముగించేందుకు సిద్దమవుతోంది. కీలకమైన బిల్లులను త్వరత్వరగా ఆమోదింపజేసుకుని సమావేశాలను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఎంపీలు, మంత్రులకు కరోనా...
కరోనా మహమ్మారి ప్రభావం నేపథ్యంలో ఈ నెల 14న అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అతి త్వరలోనే ముగిసిపోనున్నాయి. వాస్తవానికి అక్టోబర్ 1 వరకూ ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలవుతున్న ఘటనలు కేంద్రాన్ని కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. కరోనా కారణంగా తాజాగా తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ చనిపోయారు. హోంమంత్రి అమిత్షా, రవాణా మంత్రి గడ్కరీతో పాటు మరికొందరు మంత్రులకు కరోనా సోకింది. దీంతో ఎంపీలు, మంత్రులు పార్లమెంటుకు రావాలంటేనే భయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇళ్లలోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు.
సభ్యులు లేకుండా నడిపేదెలా ?
కరోనా కారణంగా పార్లమెంటు సభ్యులు ఒక్కొక్కరిగా దూరమవుతుండటంతో మొత్తంగా వర్షాకాల సమావేశాలు కళ తప్పాయి. ప్రధాన పార్టీలకు చెందిన సభ్యుల హాజరీయే అంతంతమాత్రంగా ఉంటోంది. సంఖ్యాబలం తక్కువగా ఉన్న పార్టీల ఎంపీలైతే అసలు సమావేశాలకు రావడమే మానేశారు. ముఖ్యంగా రాజ్యసభలో మెజారిటీ సభ్యులు వయోవృద్ధులు కావడంతో వీరంతా సమావేశాలకు రాలేమని ఆయా పార్టీల పెద్దలకు తెగేసి చెబుతున్నారు. దీంతో సమావేశాలను గడువు కంటే ముందు ముగించాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. స్వయంగా బీజేపీ ఎంపీలు, మంత్రులే కరోనా బారిన పడుతుండటంతో కేంద్రానికీ ఏమీ పాలుపోవడం లేదు.
Recommended Video
గడువులోగా ముగించేందుకే మొగ్గు...
పార్లమెంటు వర్షాకాల సమావేశాలను అక్టోబర్ 1 వరకూ నిర్వహించేందుకు బీఏసీలో అన్ని పార్టీలను కేంద్రం ఒప్పించింది. అయితే పెరిగిపోతున్న కరోనా కేసులతో ఇప్పుడు అన్ని పార్టీలు సమావేశాలను త్వరగా ముగించాలనే కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. అయితే కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాల్సి ఉండటంతో వీటిపై చర్చలను సైతం కుదించి సమావేశాలను గడువులోగా ముగించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ విషయంపై పార్లమెంటు అధికారులు కూడా కేంద్రం నిర్ణయానికే మద్దతు తెలుపుతుండటంతో త్వరలో దీనిపై అధికారిక నిర్ణయం వెలువడే అవకాశముంది. ఇప్పటికే ఆరు నెలలకోసారి పార్లమెంటు నిర్వహించాలనే కారణంతో వర్షాకాల సమావేశాలు ఏర్పాటు చేసిన కేంద్రం ఎలాగో కొన్ని రోజులు సమావేశాలు నిర్వహించినందున సాంకేతికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని చెబుతున్నారు.