ఈనెల 19 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు -అధికారిక ప్రకటన -నో వ్యాక్సిన్, నో ఎంట్రీ -రచ్చకు సిద్ధం
కరోనా మహమ్మారి పరిస్థితులను సరిగా నిర్వహించడంలో ఫెయిలయ్యారనే ఆరోపణలకు తోడు, కొవిడ్ వల్ల సర్వ కోల్పోయినవారికి సహాయం అందించడంతోనూ విఫలమయ్యారని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టులూ ఆక్షేపిస్తోన్న సమయంలోనే పార్లమెంట్ సమర శంఖం మోగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి.
ఈనెల 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది. లోక్ సభ, రాజ్యసభలు వేర్వేరుగా ప్రకటనలు వెలువరించాయి. దాదాపు నెల రోజులు సాగే సమావేశాల్లో మొత్తం 20 సిట్టింగ్స్ జరిగే వీలుంది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమై ఆగస్టు 15వ తేదీ లోపల ముగుస్తుంటాయి. సమావేశాలకు సిద్ధం కావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సహచర మంత్రివర్గ సభ్యులకు సూచించారు. కరోనా సంక్షోభంపై ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేవిధంగా సిద్ధమై రావాలన్నారు మోదీ. కరోనా థర్డ్ వేవ్ను నిలువరించేవిధంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్పై అవగాహన కలిగి ఉండాలన్నారు.
ఆయా విభాగాల వారీగా అమలు అవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనతో రావాలన్నారు. అదేవిధంగా దేశ ఆర్థిక వృద్ధికి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సహచర మంత్రివర్గ సభ్యులను కోరారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.
కరోనా కాలంలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, సిబ్బంది కొవిడ్ కాటుకు గురికావడం, కొందరు మంత్రులు, ఎంపీలు, సిబ్బంది ప్రాణాలు కూడా కోల్పోయిన దరిమిలా, ఈసారి జరిగే వర్షాకాలా సమావేశాల కోసం కొవిడ్ ప్రోటోకాల్స్ ను సవరించారు. పార్లమెంట్ ఆవరణలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొందినవారై ఉండాలనే నిబంధన పెట్టారు. ఇప్పటికే దాదాపు అందరు ఎంపీలు, పార్లమెంట్ సిబ్బంది కనీసం ఒక డోసు టీకాలు పొంది ఉండటం గమనార్హం. కొవిడ్ వ్యాక్సిన్ల కొరతతోపాటు నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల, రైతుల ఉద్యమంపైనా రచ్చ చేయాలని విపక్షాలు నిర్ణయించుకున్నాయి.












Click it and Unblock the Notifications