జమ్మూకాశ్మీర్ అధికారిక భాషల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ అధికారిక భాషల బిల్లు-2020కు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు లోక్సభలో మంగళవారమే ఆమోదం పొందింది. రాజ్యసభలో వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదం పొందింది. ఇప్పటికే ఉన్న ఉర్దూ, ఇంగ్లీష్ భాషలకు అదనంగా ఈ ప్రాంతంలో కాశ్మీరీ, డోంగ్రీ, హిందీ భాషలను అధికారిక భాషలుగా చేర్చింది.
ఈ సందర్బంగా రాజ్యసభలో జరిగిన చర్చలో హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. జమ్మూకాశ్మీర్లో 76 శాతం మంది ప్రజలు కాశ్మీరీ, డోంగ్రీ భాషలు మాట్లాడుతారని తెలిపారు. ఈ భాషలను అధికారిక భాషలుగా చూడాలని ఇక్కడి ప్రజల చిరకాల డిమాండ్ అని చెప్పారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 0.16 శాతం మంది ఉర్దూను, 2.3 శాతం మంది ప్రజలు హిందీ మాట్లాడుతున్నట్లు చెప్పారు. వీటితోపాటు స్థానికంగా కొందరు ప్రజలు మాట్లాడే భాషలైన పంజాబీ, గుర్జారీ, పహారీలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్ఏడీ ఎంపీ నరేష్ గుర్జాల్ మాట్లాడుతూ పంజాబీనీ కూడా ఈ బిల్లులో చేర్చాల్సి ఉందని అన్నారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి పంజాబీనేనని, పంజాబీ భాషను అధికారిక భాషగా గుర్తించకపోవడం విచారకరమని అన్నారు. దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు. సుమారు 13 లక్షల మంది పంజాబీలు జమ్మూకాశ్మీర్లో నివసిస్తున్నారని తెలిపారు. పంజాబీతోపాటు గుర్జారీ, పహారీలను కూడా అధికారిక భాషలుగా చేర్చితే జమ్మూకాశ్మీర్లో అందరి విశ్వాసాన్ని గెల్చుకున్నట్లుగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఆర్పీఐ పార్టీ సభ్యుడు రాందాస్ అథవాలే, మమతా మోహంతా(బీజేడీ)లు ఈ బిల్లులకు మద్దతు పలికారు. పీవోకే కూడా త్వరలోనే భారత్లో కలుస్తుందని రాందాస్ అథవాలే అన్నారు ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించడంతో దేశంలో పూర్తిస్థాయిలో విలీనమైన విషయం తెలిసిందే.