పార్లమెంటు అసాధారణ ఆదేశాలు: ఇక్కడ అధికారులు, సిబ్బంది భోజన పాత్రలను కడగొద్దు!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంటు అసాధారణ ఆదేశాలను జారీ చేసింది. పార్లమెంటులో పనిచేసే వందలాది మంది సిబ్బంది తమ భోజన డబ్బా(లంచ్ బాక్స్)లను, ఇతర పాత్రలను పార్లమెంట్ కాంప్లెక్స్లో శుభ్రం చేయకూడదని స్పష్టం చేసింది.
లోక్సభ సెక్రటేరియట్ ఈ మేరకు ఇంటర్నల్ సర్కూలర్ను జారీ చేసింది. అదికారులు దీన్ని తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్ వాష్రూమ్స్లో ఇక్కడి అధికారులు, సిబ్బంది తమ లంచ్ బాక్సులను, ఇతర పాత్రలను శుభ్రం చేస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది.
ఈ కారణంగానే డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింటోందని, వాష్రూమ్స్ను ఉపయోగించేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించింది. అంతేగాక, ఈ ప్రాంత పరిశుభ్రతను ఈ దెబ్బతీస్తోందని తెలిపింది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పార్లమెంట్ క్యాంటిన్ను మూసివేయడంతో ఇప్పుడు అధికారులు, సిబ్బంది లంచ్ బాక్సులు తెచ్చుకుంటున్నారు. భోజనం తర్వాత పాత్రలు వాష్రూమ్స్లలో కడగడం, వ్యర్థాలను అక్కడే పారేయడంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు సెక్రటేరియట్ ఈ ఆదేశాలను జారీ చేసింది.
ఇంతకుముందు క్యాంటీన్లను నార్తెర్న్ రైల్వే నిర్వహించేది. గుంపులుగా చేరకూడదనే ఉద్దేశంతో భోజన క్యాంటీన్లను మూసివేసినప్పటికి.. టీ, స్నాక్స్ మాత్రం కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ప్రాంతమంతా పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని పార్లమెంట్ సెక్రటేరియట్ కోరింది.
Recommended Video
కాగా, భారత పార్లమెంటులో 2వేల మంది కంటే ఎక్కువ అధికారులు, సిబ్బంది, వెయ్యి మందికంటే ఎక్కువ సెక్యూరిటీ సిబ్బంది పనిచేస్తున్నారు. పార్లమెంటు క్యాంటీన్లో అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే భోజనం చేస్తారని, ఆ వైపునకు వచ్చే ఎంపీల సంఖ్య అత్యంత తక్కువ అని ఇంటర్నల్ కమిటీ పేర్కొంది.