పార్లమెంటు సమావేశాలు: 89 గంటల సమయం, రూ. 133 కోట్ల ప్రజా ధనం వృథా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలో ప్రతిపక్షల ఆందోళనల మధ్య కీలక అంశాలపై చర్చ జరగకుండా ముగిశాయి. పెగాసస్, కొత్త వ్యవసాయ చట్టాలు, కరోనా సెకండవ్ వే్ తదితర అంశాలపై అధికార, విపక్ష పార్టీలు వ్యవహరిస్తున్న తీరుతో లోక్సభ, రాజ్యసభలో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ సెషన్ ద్వారా ఇప్పటి వరకు 130 కోట్లకుపైగా ప్రజా ధనం వృథా అయ్యిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
జులై 19న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ విపక్షాలు పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేస్తూ ఉభయసభల్లోనూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. విపక్ష నేతలు, జడ్జీలు, రాజకీయ నాయకులు, కొందరు కేందర మంత్రుల ఫోన్లను కూడా ఈ స్పైవేర్తో హ్యాక్ చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అంతేగాక, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు జడ్జీతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కాగా, విపక్షాల ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా ఎవరి ఫోన్లూ హ్యాక్ చేయబడలేదని, విపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. మరోవైపు పార్లమెంటులో ఆందోళనల కారణంగా 54 గంటలపాటు పనిచేయాల్సిన లోక్సభ సమావేశాలు కేవలం 7 గంటలే పనిచేశాయి. 53 గంటలకు గానూ రాజ్యసభ 11 గంటలు మాత్రమే పనిచేసింది.
ఉభయసభలూ 107 గంటలపాటు పనిచేయాల్సి ఉండగా.. 18 గంటలే కార్యకలాపాలను కొనసాగించనట్లు ఓ అధికారి వెల్లడించారు. దీంతో 89 గంటల పార్లమెంటు సమావేశాల సమయం వృథా అయిపోయిందని చెప్పారు. దీంతో మొత్తంగా పన్ను కట్టే ప్రజల సొమ్ము దాదాపు 133 కోట్ల రూపాయల మేర వృథా అయ్యిందని తెలిపారు. సమావేశాలు సజావుగా సాగనీయకుండా ఇలా ప్రజాధనాన్ని వృథా చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.