మార్చి 8 నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ కోవిడ్ నిబంధనలతో పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రాజ్యసభ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్సభ సమావేశాలు జరుగుతాయని లోక్సభ సచివాలయం వెల్లడించింది.
జనవరి 29న ప్రారంభమైన పార్లమెంటు తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం తర్వాత పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం, బడ్జెట్పై సాధారణ చర్చ జరిగింది.
వ్యవసాయ చట్టాలపైనా చర్చ జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు మార్చి 8 వరకు వాయిదా పడింది. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కాగా, నాలుగు రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, అస్సాం, పశ్చిమబెంగాల్, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నవేళ తాజా పార్లమెంటు సమావేశాల్లో పాలు కీలక బిల్లులకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.