కరోనా..చైనా: గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం: వ్యాక్సిన్ వస్తే గానీ: శని, ఆదివారాల్లోనూ: మోడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, రోజూ వేలాది పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తోన్న పరిణామాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యసభ, లోక్సభ సమావేశం అయ్యాయి. బడ్జెట్ సమావేశాలను అర్ధాంతరంగా వాయిదా వేసిన తరువాత.. పార్లమెంట్ ఉభయ సభలు సమావేశం కావడం ఇదే తొలిసారి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య సమావేశాలు ఏర్పాటు చేసినందున.. అదే స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
భారత్పై చైనా హైబ్రిడ్ యుద్ధం?: ప్రధాని, సీజేఐ, ముఖ్యమంత్రులు: 10 వేలమంది శక్తిమంతుల డేటా
ప్రముఖులకు నివాళి..
సభ ప్రారంభమైన వెంటనే..ఇటీవల కన్నుమూసిన ప్రముఖులకు సభ్యులు నివాళి అర్పించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రఖ్యాత క్లాసికల్ వోకలిస్ట్ పండిత్ జస్రాజ్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీసింగ్ టండన్, ఉత్తర ప్రదేశ్ మంత్రులు కమలా రాణి వరుణ్, చేతన్ చౌహాన్, కేంద్ర మాజీమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్లకు సభ్యులు నివాళి అర్పించారు. అనంతరం సభను గంటపాటు వాయిదా వేశారు.
కరోనా.. కర్తవ్యాల నిర్వహణ..
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘకాలం అనంతరం పార్లమెంట్ను సమావేశ పర్చాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ఉభయ సభలు సమావేశం అవుతున్నాయిని చెప్పారు. ఒకవైపు కరోనా.. మరోవైపు కర్తవ్యాల నిర్వహణ ఉందని, సభ్యులందరూ తమ కర్తవ్యాలను నిర్వర్తించడానికే మొగ్గు చూపారని అన్నారు. ఈ సారి శని, ఆదివారాల్లోనూ సమావేశాలను నిర్వహించబోతున్నామని అన్నారు. ఉభయ సభల్లో ఎంత లోతైన చర్చ జరిగితే.. అంత మంచి ఫలితాలు వెలువడుతాయని అన్నారు.
వైరస్ వల్ల గడ్డు స్థితులు..
కరోనా వైరస్ వల్ల తలెత్తిన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని ప్రధాని అన్నారు. వైరస్ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకూ ఈ పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఏ మూలలో వ్యాక్సిన్ అందుబాలోకి వచ్చినా, లేదా మనదేశ శాస్త్రవేత్తలు దీన్ని తయారు చేసినా సంకట స్థితిగతుల నుంచి బయటపడటంలో విజయం సాధించినట్టేనని మోడీ అన్నారు.
మాతృభూమి రక్షణలో..
మాతృభూమి రక్షణ కోసం దేశ సైనికులు సరిహద్దుల్లో, క్లిష్ట వాతావరణాన్ని ఎదుర్కొంటూ, ఎత్తైన పర్వత శిఖరాలపై రేయింబవళ్లు పహారా కాస్తున్నారని, అచంచల విశ్వాసాన్ని కనపరుస్తున్నారని మోడీ పేర్కొన్నారు. వారికి అండగా దేశ ప్రజలందరూ ఉన్నారని చెప్పారు. దేశం మొత్తం ముక్తకంఠంతో సైనికుల ధైర్యసాహసాలను కొనియాడుతోందని, వారి త్యాగనిరతిని కీర్తిస్తోందని నరేంద్ర మోడీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజలు స్పందిస్తున్నారని చెప్పారు. ఒకవైపు దేశ అంతర్గతంగా కరోనాను ఎదుర్కొంటూ.. మరోవైపు సరిహద్దులను కాపాడుకుంటున్నామని మోడీ పేర్కొన్నారు.