జేఎన్యూ, జామియా హింసాత్మక ఘటనలపై హోమ్సెక్రటరీని నివేదిక కోరిన కమిటీ
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ, మరియు జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంసెక్రటరీ అజయ్కుమార్ భల్లా మరియు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్యా పట్నాయక్లకు నోటీసులు ఇచ్చింది హోమ్శాఖకు చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. జనవరి 13న హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హోంశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్యానెల్కు కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఢిల్లీ మరియు నేషనల్ క్యాపిటల్ రీజియన్లలో పెరుగుతున్న క్రైమ్ రేట్ పై కూడా చర్చిస్తారని అధికారులు తెలిపారు.
JNU Violence:వ్యతిరేక గళాన్ని నొక్కేస్తోన్న మోడీ సర్కార్: సోనియా ఫైర్
జామియా మిలియా యూనివర్శిటీలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపిన సందర్భంలో హింసకు తావు ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశంతో పాటు జేఎన్యూలో కొద్దిరోజుల క్రితం జరిగిన హింసాత్మక ఘటనపై కూడా ప్యానెల్ తెలుసుకోవాలని భావిస్తోందని ప్యానెల్ సభ్యులు అయిన పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఎంపీ ఒకరు చెప్పారు. జేఎన్యూలో ముసుగులు ధరించి హింసకు పాల్పడిన వారిని ఇంకా గుర్తించాల్సి ఉంది.
జేఎన్యూలో హింసాత్మక వాతావరణం చోటుచేసుకున్న తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జేఎన్యూ విద్యార్థులు టీచర్లపై కొందరు ముసుగులు ధరించి దాడి చేయడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించిన రాహుల్ గాంధీ... దేశంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే దాడులకు దిగుతారా అని ట్వీట్ చేశారు. ధైర్యంగా ప్రశ్నించే విద్యార్థుల నోళ్లను నొక్కుతున్నారని దేశంలో భయాన్ని అభద్రతను సృష్టిస్తున్నారని ఇందుకు నిదర్శనం జేఎన్యూ ఘటనే అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే హోంశాఖ వ్యవహరాలకు సంబంధించి పార్టమెంటరీ ప్యానెల్లో 31 మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఇందులో 21 మంది లోక్సభ ఎంపీలు ఉండగా 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. జేఎన్యే హింసాత్మక ఘటనపై ఢిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ షాలినీ సింగ్ తయారు చేసిన నివేదికను కూడా ఈ ప్యానెల్ కోరే అవకాశం ఉంది. ఈ నివేదికను షాలినీ సింగ్ హోమ్శాఖ కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంది. మరోవైపు ఈ హింసకు పాల్పడింది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీ అని జేఎన్యూఎస్యూ ఆరోపించగా ఆరోపణల్లో వాస్తవం లేదని ఏబీవీపీ కొట్టిపారేసింది.