ఇంట్రెస్టింగ్: సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?
ఢిల్లీ: ఎన్నికల వేళ మరోసారి రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. మాజీ కేంద్ర రక్షణ మంత్రి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ను కలిసిన తర్వాత పలు ఆసక్తికర విషయాలను రాహుల్ గాంధీ వెల్లడించారు. నాడు రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్కు మోడీ ప్రభుత్వం చేసుకున్న కొత్త ఒప్పందం గురించి ఏమీ తెలియదనే ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
కొత్త ఒప్పందంపై పారికర్కు ఏమీ తెలియదు
మాజీ రక్షణశాఖ మంత్రి ప్రస్తుత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్కు రాఫెల్కు సంబంధించిన కొత్త ఒప్పందం గురించి అసలు ఏమీ తెలియదని చాలా స్పష్టంగా తనతో చెప్పినట్లు రాహుల్ గాంధీ తెలిపారు. అనారోగ్యంతో ఉన్న మనోహర్ పారికర్ను రాహుల్ గాంధీ పరామర్శించిన తర్వాత ఆయన ఈ విషయాలను వెల్లడించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే రాఫెల్పై పారికర్తో చర్చించారా అన్న ప్రశ్నపై మాత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాదు కొద్ది రోజుల క్రితం గోవాలో రాఫెల్ ఆడియో టేపులను కాంగ్రెస్ బయటపెట్టిన తర్వాత కూడా రాహుల్ పారికర్కు కొత్త ఒప్పందంపై అవగాహన లేదు అని చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే రాహుల్ తనను పరామర్శించేందుకు వచ్చినప్పుడు రాఫెల్ గురించి తమ మధ్య ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ రూ.30వేల కోట్ల ప్రజాధనాన్ని అతని స్నేహితుడు అనిల్ అంబానీకి కట్టబెట్టారని దుయ్యబట్టారు.
సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను ఇందుకోసమే తొలగించారా..?
రూ.526 కోట్లు విలువ చేసే విమానం ధర అమాంతంగా రూ.1600 కోట్లకు ఎలా పెరిగిందని రాహుల్ ప్రశ్నించారు. అంటే దేశ ప్రజలకు ఒక విషయం స్పష్టంగా అర్థమైందని అది ప్రధాని మోడీ అవినీతికి పాల్పడ్డారనేది అర్థమైందన్నారు. ఇదిలా ఉంటే రాహుల్ పసలేని ఆరోపణలు చేస్తున్నారని అధికార బీజేపీ ధ్వజమెత్తింది. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడింది. అంతేకాదు సీబీఐ డైరెక్టర్గా అలోక్ వర్మను తిరిగి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ.. ఆదేశాలను పక్కనబెట్టి అతన్ని తొలగించిందని గుర్తు చేశారు రాహుల్ గాంధీ. ఒకవేళ అలోక్ వర్మ వస్తే కచ్చితంగా రాఫెల్ ఒప్పందంకు సంబంధించి ప్రధానిని విచారణ చేస్తారనే భయం పట్టుకుంది కాబట్టే ఆయన్ను తొలగించడం జరిగిందని రాహుల్ చెప్పారు.
ఉద్యోగావకాశాలు కోల్పోయిన నిరుద్యోగ యువత
అనిల్ అంబానీకే కాంట్రాక్టు అప్పగించాలని మోడీ తనతో స్పష్టంగా చెప్పినట్లు ఫ్రాన్స్ మాజీ ప్రధాని హోలెండే మీడియాముఖంగా చెప్పారని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. గత 70 ఏళ్లుగా ఎయిర్క్రాఫ్ట్లను తయారు చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి ఒప్పందాన్ని లాక్కుని ఒక్క విమానం కూడా తయారు చేసిన అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి ఎలా కట్టబెట్టాలనుకుంటున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఒకవేళ ఈ ఒప్పందం హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కు దక్కి ఉంటే ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగం లభించి ఉండేదని చెప్పిన రాహుల్... వీరంతా ఉద్యోగాలు పొందే అవకాశం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.