ప్రజా నాడి తెలుసుకోవడంలో పార్టీలు విఫలం..! కాని పీఎం ఎవరైతే బాగుంటుందో తెలుసుకున్న జనాలు..!!
ఢిల్లీ/హైదరాబాద్ : అందరికీ పీఎం పీఠంపై ఆశ. రాజకీయంగా ఉన్నతంగా ఎదిగిన సీనియర్ నేతల్లో చివరి కోరిక కూడా అదే. అందుకే.. ఇదే చిట్టచివరి ఛాన్స్గా భావిస్తున్నారు చాలామంది సీనియర్ జాతీయ రాజకీయ నేతలు. గతంలో భారత దేశ ప్రధానులుగా చేసి, బంగారాన్ని తాకట్టుపెట్టి, అప్పుల గుండంలోకి నెట్టిన ప్రధాన మంత్రుల్లో ఐకేగుజ్రాల్, వి.పి.సింగ్, దేవెగౌడ, చంద్రశేఖర్ ఇలా.. ఐదారుగురు పేర్లు వినిపిస్తుంటాయి. మళ్లీ.. అదే సంప్రదాయం మళ్లీ ఎక్కడ పునరావృత్తం అవుతుందో ననే ఆందోళన కూడా ప్రజల్లో నెలకొంది. కాబట్టే.. సంకీర్ణ ప్రభుత్వాల లోటుపాట్లను కళ్లారా చూసిన ఓటర్లు జాతీయ పార్టీలకే పట్టం కట్టాలనే నిర్ణయానికి వచ్చారు. దాని ఫలితమే ఎన్డీఏకు మరోసారి అవకాశం ఇవ్వటం. దీన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బహిర్గతం చేయటమే నిదర్శనం.
పీఎం పదవిపై కన్నేసిన నేతలు..! పోటీలో బీజేపి యేతర నాయకులు..!!
చింతచచ్చినా పులుపు చావనట్టుగా, సంకీర్ణ ప్రభుత్వాన్ని భుజాన కెత్తుకుని ప్రధాని సీటులో కూర్చోవాలని ఉబలాటపడుతున్న వారంతా ఏకం అవుతున్నారు. ఆ జాబితాలో మమతాబెనర్జీ మొదటివరుసలో ఉంటే తరువాత మాయావతి, రాహుల్గాంధీ, శరద్పవార్, నితీష్కుమార్, లల్లూ ప్రసాద్ , దేవెగౌడ, చంద్రబాబు కూడా ఉండటం చర్చనీయాంశం. వీరందరి తక్షణ కర్తవ్యం మోదీను గద్దెదించాలి. లేకపోతే రాబోయే ఐదేళ్లలో పెరిగే మోదీ ప్రభావాన్ని తట్టకోవడం కష్టమేనని ఈ నేతలు భావిస్తున్నారు.
రాజకీయాల్లో కురు వృద్దులు..! ఒక్క ఛాన్స్ అంటున్న నేతలు..!!
పైగా.. తమపై కక్షసాధింపునకు దిగితే భరించే వయసు కాదు. ఎదురుదాడి చేసేందుకు సరైన అండదండలు లభిస్తాయనే నమ్మకం లేదు. వీటి సంగతి ఎలా ఉన్న బెంగాల్లో మమత వల్ల అవమానాలు చవిచూసిన బీజేపీ ప్రతీకారం తీర్చుకోవటం ఖాయం, కర్ణాటకలో పరాభవానికి తగిన గుణపాఠం చెప్పాలని ఉవ్విళ్లూరుతుంది. కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ వంటి చోట్ల తమకు వ్యతిరేకంగా పనిచేసిన నేతల పాపాల చిట్టా బయటకు తీసే ప్రమాదమూ ఉందనే ఆందోళన నెలకొంది.
బీజేపి అదికారంలోకి వస్తే తెలుగు రాష్ట్రాలు టార్గెట్..! ప్రత్యమ్నాయం దిశగా బాబు..!!
ఈ జాబితా చంద్రబాబు అండ్ బ్యాచ్ ముందువరుసలో ఉంటారనే భయం కూడా టీడీపీపీని వెంటాడుతుంది. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర సంస్థలకు ప్రవేశం లేదని బోర్డు పెట్టిన బాబుకు గెలిచినా.. ఓడినా.. మోదీ నుంచి ఒకేరకమైన ట్రీట్మెంట్ తప్పదంటూ బీజేపి శ్రేణులు చెబుతున్నాయి. వీటన్నింటినీ అంచనా వేసిన చంద్రబాబు, మమత, మాయావతి అండ్ ప్రాంతీయ పార్టీల నేతలు కూటమి ఏర్పాటుకు తమ బలాన్ని కూడగడుతున్నారు. కలసివచ్చే పార్టీల మద్దతును అంచనా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఇవన్నీ ఎక్కడా కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదట. చంద్రబాబు వెళ్లగానే స్వాగతం పలికే ఉత్తరాధి నేతలు.. ఈయన ఇటు రాగానే.. మరో కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేసే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రయత్నాలు.. ఫలితాలిస్తాయా..! పనికిరాకుండా పోతాయా..?
చంద్రబాబుకు కామన్ శత్రువులు చంద్రశేఖర్ రావు, జగన్లను కలుపుకోవటం ద్వారా మరింత బలపడతామనే ఆలోచన కూడా మమతలో ఉందట. ఇదే విషయాన్ని తమ అనుచరుల ద్వారా సమాచారం చేరవేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి కూడా జగన్కు ఆహ్వానం అందటంతో ఫలితాల అనంతరం తమ ఆలోచనను బహిర్గతం చేస్తామంటూ విజయసాయిరెడ్డి ఇరువురి నేతలకు సమాధానమిచ్చారట. జగన్ ఓడినా.. గెలిచినా కేంద్రంలో కీలకంగా మారటం ద్వారా ఏపీలో తమకు సానుకూల వాతావరణం సృష్టించుకోవాలని భావిస్తున్నారట. మరి ఈ లెక్కన. చంద్రబాబు పరుగులు.. ఆయాసంగానే మిగులుతాయా! ఏమైనా లాభాన్ని తెచ్చిపెడతాయా! అనేది లక్షడాలర్ల ప్రశ్న అనే చర్చ జరుగుతోంది.