క్యాంపులకు కర్ణాటక ఎమ్మెల్యేలు.. బలపరీక్ష నెగ్గుతామన్న సిద్ధరామయ్య, బీజేపీపై రాహుల్ ఫైర్
బెంగళూరు : కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేల అనర్హత, రాజీనామాల ఆమోదం అంశాన్ని మంగళవారం వరకు యధాతథ స్థితిలో పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసినా .. కన్నడనాట హైడ్రామా నడుస్తోంది. అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధమని సీఎం కుమారస్వామి స్పస్టంచేయడంతో అధికార, విపక్షాల క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ వైపు, బీజేపీ ఎమ్మెల్యేలు మరోవైపు క్యాంపులోకి తీసుకెళ్లారు. మరోవైపు బలాన్ని నిరూపించుకుంటామని కాంగ్రెస్ ఎల్పీ నేత సిద్దరామయ్య కూడా ధీమా వ్యక్తం చేశారు.
మారిన సిచుయేషన్
కుమారస్వామి ప్రకటనతో బెంగళూరులో వేగంగా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఎక్కడి వారు అక్కడ తమ ఎమ్మెల్యేలను తీసుకొని క్యాంపులకు వెళ్లిపోయారు. జేడీఎస్ తమ ఎమ్మెల్యేలను తీసుకొని నందిహిల్స్ వెళ్లగా, కాంగ్రెస్ పార్టీ స్టార్ హోటల్కు తీసుకెళ్లింది. యెల్లంకలోని ఓ రిసార్ట్కు బీజేపీ తమ 105 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది. అయితే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలతో కుమారస్వామి మాట్లాడారని ఊహాగానాలతో ఆ పార్టీ ముందే అప్రమత్తమైంది. 13 నెలల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే 16 రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఒక్కసారి పరిస్థితి మారిపోయింది.
విజయమో ..
మరోవైపు బలపరీక్షల సంకీర్ణ సర్కార్ నెగ్గుతుందని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్ల రాజీనామాతో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ.. బలపరీక్షకు బీజేపీ భయపడుతుందని ఆరోపించారు. కానీ మేం విశ్వాసంతో ఉన్నామని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేవపెట్టారని ప్రశ్నించారు. ఆ పార్టీకి సంకీర్ణ ప్రభుత్వం అంటే భయమని, అందుకోసమే అవిశ్వాస తీర్మానం అని బెదిరించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ క్రమంలో సీఎం కుమారస్వామి బలపరీక్షకు తాను సిద్ధమని ప్రకటించారని గుర్తుచేశారు. దీంతో సభలో బలపరీక్ష సందర్భంగా .. ఎవరి బలం ఎంటో తెలుస్తోందన్నారు.
శాశ్వతం కాదు ..
మరోవైపు కర్ణాకట రాజకీయాలపై రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. తనకున్న అధికారం, డబ్బుతో బీజేపీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో మనీ, పవర్తో ప్రభుత్వాన్ని అస్థిరపరుచాలని చూస్తుందని మండిపడ్డారు. గోవాలో మాదిరిగా కర్ణాటకలో కూడా చేయాలని బీజేపీ భావిస్తుందని ఫైరయ్యారు. వారికి డబ్బులు ,అధికారం ఉన్నదని వారు అలా ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రజలు అన్నింటినీ నిశీతంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సత్యంతో పోరాడుతుందని తెలిపారు. సత్యమే కాంగ్రెస్ పార్టీని మరింత బలమైన శక్తిగా రూపొందిస్తుందని అభిప్రాయపడ్డారు.