యుపి పోరు: మహిళల వాటా అంతా 'మాయ'
రాజకీయ పార్టీలన్నీ మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్తుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి స్వరం మారుస్తుంటాయి. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ సంగతి పక్కనబెడితే కనీసం 10 శాతం సీట్లు కూడా ఆయా పార్టీలు.
లక్నో: రాజకీయ పార్టీలన్నీ మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్తుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి స్వరం మారుస్తుంటాయి. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ సంగతి పక్కనబెడితే కనీసం 10 శాతం సీట్లు కూడా ఆయా పార్టీలు కేటాయించడం లేదు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో ఇది ఖచ్చితంగా కానవస్తుంది.
మాజీ ముఖ్యమంత్రి మాయావతి అధ్యక్షతన పనిచేస్తున్న బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) ఇందుకు మినహాయింపు కాదు. ఎన్నికల పోరాట సమయంలో 'బెహెన్ జీ కో ఆనేదో, బేటీయోంకో ముస్కురానే దో' అనే నినాదం మస్తుగా వినిపిస్తుంది.
కానీ ఈ నినాదం మాత్రం ఇబ్బడిముబ్బడిగా మహిళా నేతలకు టిక్కెట్ల కేటాయింపు దగ్గరకు వచ్చేసరికి మాయవవుతుంది. ఈ ధోరణి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పక్షాలకూ వర్తిస్తుంది.
మహిళలకు మాయావతి ఇలా...
ఇప్పటివరకు కేటాయించిన 401 స్థానాల్లో బీఎస్పీలో మహిళలకు కేవలం 18 స్థానాలు మాత్రమే కేటాయించారు మాయావతి. కనీసం మొత్తం స్థానాల్లో ఐదు శాతం కూడా కాదు. వాటిల్లో కూడా పార్టీ నేతల భార్యలు, బంధువులకు కేటాయించినవే ఎక్కువ. ‘బెహెన్ జీ ఒక్కరే పార్టీలో మహిళా నాయకురాలు. ఇంతకుముందు ఆమె సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు సురక్షిత స్థానం కల్పించారు' అని ఓ బీఎస్పీ నేత తెలిపారు.
డింపుల్, ప్రియాంకలపైనే ఆశలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేతలు ప్రియాంక గాంధీ, డింపుల్ యాదవ్ స్టార్లుగా ముందుకు వచ్చారు. అంతే కాదు రెండు పార్టీల తరఫున స్టార్ కాంపెయినర్లుగా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేయనున్నారని వార్తలొచ్చాయి. కానీ ఈ రెండు పార్టీలు మహిళలకు టిక్కెట్లే కేటాయించాల్సి వచ్చేసరికి పూర్తిగా వెనుకడుగేశాయి.ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు వెల్లడించిన 43 స్థానాల్లోనూ ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో ఒకరు ఫేమస్ గులాబీ గ్యాంగ్ వ్యవస్థాపకురాలు ఒకరు ఉన్నారు.
కన్యావిద్యాదాన్ ప్రకటించినా కూడా..
కన్యా విద్యాదాన్ వంటి మంచి పథకాలకు మేనిఫెస్టోలో చోటు కల్పించిన సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) కూడా మహిళకు మొండిచేయే చూపింది. ఎస్పీ అధినేత, యూపీ సిఎం అఖిలేశ్ యాదవ్ ఇప్పటివరకు ప్రకటించిన 324 స్థానాల్లో తన మరదలు అపర్ణా యాదవ్తోపాటు మొత్తం 24 మంది మహిళలకు మాత్రమే పోటీచేసే అవకాశం కల్పించారు. అలీగఢ్ విశ్వవిద్యాలయం నాయకురాలు రిచాసింగ్, పాత తరం మహిళా నాయకులు అరుణ్ కుమారి, సుశీలా సరోజ్ మాత్రమే పేరొందిన ప్రముఖులు. వీటిల్లో కాంగ్రెస్ పార్టీతో సీట్ల సర్దుబాటు మేరకు కొన్ని సీట్లలో అభ్యర్థులు వైదొలగాల్సి ఉంటుంది.
10 స్థానాలూ పార్టీ నేతల బంధువులకే
ఇక భేటీ పడావో - భేటీ బచావో అనే నినాదంతో ముందుకు వెళుతున్న బిజెపి 300 స్థానాలకు పైగా అభ్యర్థులను ప్రకటిస్తే 36 స్థానాల్లో మాత్రమే మహిళలకు చోటు దక్కింది. వాటిలో 10 స్థానాలు పార్టీ నేతల బంధువులకే కేటాయించారు. కారణాలేమైనా మిగతా పార్టీలతో పోలిస్తే కమలనాథులు కొంచెం బెటర్. లక్నో కంటోన్మెంట్ నుంచి రీటా బహుగుణ, పార్టీ కార్యకర్త భార్య మంజు త్యాగి, హుకుంసింగ్ కూతురు మ్రిగంకా గుప్తా, కల్యాణ్ సింగ్ కు అత్యంత సన్నిహితులు అనితా రాజ్ పుత్, కంచన్ లోధీ, కౌశల్ కిశోర్ భార్య జైదేవి, వినయ్ కతియార్ కూతురు నీలిమా కతియార్, బాహ్ రాజకుటుంబ సభ్యురాలు రాణి పక్షాలికా సింగ్, అమేథిలో రాణి గరిమా సింగ్ టిక్కెట్లు పొందిన ప్రముఖులే. పక్షాలికా సింగ్ కూడా బీజేపీలో చేరిన మాజీ ఎస్పీ నేత అరిదామన్ సింగ్ భార్యే కావడం గమనార్హం.
గెలుపు గుర్రాలకే పార్టీలు...
ఎన్నికల్లో మహిళలకు టిక్కెట్ల కేటాయింపునకు పార్టీలు గెలుపునకే ప్రాధాన్యం ఇస్తున్నాయని లక్నో యూనివర్సిటీ ప్రొఫెసర్ రాకేశ్ చంద్ర వ్యాఖ్యానించారు. మహిళలు వ్యక్తిగతంగా ఆర్థిక బలంతో సొంత బలంపై పోటీచేసే శక్తి సామర్థ్యం చాలా తక్కువని, కుటుంబం నుంచి గానీ, పార్టీ నుంచి గానీ కొందరు పురుషుల ప్రోత్సాహం ఉంటే ముందుకు వెళ్లలేని పరిస్థితిలో మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. కానీ యువ ఓటర్లు మాత్రం ప్రత్యేకించి యువతులు మహిళలకు అధిక ప్రాధాన్యం కావాలని కోరుకుంటారని ఐటీ ప్రొఫెషనల్ అనుభా మిశ్రా అన్నారు. తన పరిధిలో మహిళా అభ్యర్థి ఎవరున్నా పార్టీలతో సంబంధం లేకుండా ఓటేస్తానన్నారు. రాజకీయాల్లో పాల్గొనేందుకు మహిళలకు హక్కు కల్పిస్తే తప్ప వారి ప్రాతినిధ్యం పెరుగదని ఓ బ్యాంక్ ఉద్యోగిని వ్యాఖ్యానించారు. ఆయా పార్టీల టిక్కెట్ల కేటాయింపు తీరుపై యువతరం ఓటర్లలో అసంత్రుప్తి కానవస్తున్నది. పార్టీ నేతల కుటుంబ సభ్యుల్లోని మహిళలకు మాత్రమే టిక్కెట్లు కేటాయిస్తున్నారని, వీరంతా కుటుంబంలోని పురుషుల చేతిల్లో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తారే తప్ప, వారికి స్వేచ్ఛ ఉండదని అంటున్నారు.