కర్నాటకం : భేటీలతో నేతలు బిజీ బిజీ.. కుమారస్వామి భవితవ్యం రేపు తేలే అవకాశం
బెంగళూరు : కర్నాటక రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. అసెంబ్లీలో బలనిరూపణ విషయంలో సోమవారం ఏం జరగనుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. విశ్వాస పరీక్ష నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ నేతలు చర్చోపచర్చలు జరుపుతున్నారు. గవర్నర్ ఇప్పటికే రెండుసార్లు గడువు విధించినా ఎటూ తేలకపోవడంతో కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించే అకాశముందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
చివరి ప్రయత్నాల్లో నేతలు
కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం కుమారస్వామి, రాజీనామా వెనక్కి తీసుకున్న కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి శనివారం మాజీ ప్రధాని దేవెగౌడతో రహస్య మంతనాలు జరిపారు. ముంబైలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలపై బుజ్జగించే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తమకు చెప్పకుండా రాజీనామా వెనక్కి తీసుకున్న రామలింగారెడ్డిపై రెబెల్ ఎమ్మెల్యేలు అగ్గిమీదగుగ్గిలం అవుతున్నట్లు సమాచారం. ఆయన స్వయంగా వచ్చి బతిమాలినా విశ్వాస పరీక్షకు హాజరయ్యే అవకాశం లేదని వారు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోైపు జేడీఎస్ ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు దేవెగౌడ స్వయంగా రంగంలోకి దిగినా ఫలితంగా లేకుండా పోయింది.
కుమారస్వామి రాజీనామాకు పట్టు
జేడీఎస్ ఎమ్మెల్యేలు సీఎం కుమారస్వామి రాజీనామాకు పట్టుబడుతున్నారు. ఆయన పదవి నుంచి వైదొలగిన తర్వాతే తిరిగి రాష్ట్రంలో అడుగుపెడతామని అంటున్నారు. ఈ మేరకు వారు ఓ వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు సోమవారం బల పరీక్ష జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెబెల్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు జేడీఎస్, కాంగ్రెస్లు బల నిరూపణ జరగకుండా కాలయాపన చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు విశ్వాస పరీక్ష పూర్తయ్యే వరకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ రిసార్టును వీడరాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఆదేశించారు.
సమావేశాలపై నేతలు బిజీ బిజీ
అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యే శ్రీమంత పాటిల్కు ముంబైలో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. మరోవైపు హోటల్లో మకాం వేసిన అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరితోనూ మాట్లాడేందుకు సముఖత వ్యక్తంచేయడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని నిర్ణయించారు. మరోవైపు గవర్నర్ జోక్యం, విప్ పై స్పష్టత ఇ్వాలంటూ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ సోమవారం విచారణకు రానున్న నేపథ్యంలో న్యాయస్థానానికి వినిపించాల్సిన వాదనలపై చర్చించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆదివారం వేర్వేరుగా భేటీ కానున్నారు.
రాష్ట్రపతి పాలన విధించే ఛాన్స్?
ఇదిలా ఉంటే కర్నాటకలో ప్రస్తుత రాజకీయ అనిశ్చితికి బీజేపీ కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని చేజిక్కించుకునేందుకే కమలదళం ఇదంతా చేస్తోందని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే సోమవారం బలపరీక్ష నిర్వహిస్తే కుమారస్వామి ఓడిపోవడం ఖాయమని బీజేపీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. అప్పటి వరకు రాష్ట్రపతి పాలన విధించే అంశాన్ని పెండింగ్లో ఉంచాలని రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తోంది. మరోవైపు కన్నడ రాజకీయాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తేల్చిచెప్పారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సోమవారం బల నిరూపణ జరగకపోతే గవర్నర్ వాజూభాయ్ వాలా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.