చిన్నమ్మకే సీనియర్ల ఓటు:ఆండీపట్టు లేదా నన్నిలం నుండి పోటీకి ఆసక్తి
శశికళ ముఖ్యమంత్రిగా బాద్యతలను చేపడితే తమ స్థానాల్లో పోటీచేయాలని సిట్టింగ్ ఎంఏల్ఏలు, మంత్రులు కోరుతున్నారు.
చెన్నై:తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుతూ చిన్నమ్మ శశికళను కోరే పార్టీ నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది,.పార్లమెంట్ లో పార్టీ నాయకుడు తంబిదురై కూడ చిన్నమ్మకు మద్దతు పలకడంతో ఇతరులు కూడ ఆయన దారినే ఎంచుకొన్నారు. చిన్నమ్మ ఆండిపట్టి లేదా నన్నిలం లలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
జయలలిత మరణంతో అన్నాడిఎంకె పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవడంలో శశికళ సక్సెస్ అయ్యారు. పార్టీలో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవిని ఆమె దక్కించుకొన్నారు. పార్టీ సీనియర్లంతా ఆమె వెంటే నడిచారు.
ఎన్నికల నిర్వహణ భాద్యతను కూడ ఆమెకే అప్పగిస్తూ కీలకమైన సవరణను కూడ ప్రతిపాదించారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ బాద్యత కూడ ఆమె దక్కించుకొన్నారు.
ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం కు వ్యతిరేకంగా ఆయన మంత్రివర్గంలోని మంత్రులే ప్రకటనలు చేస్తున్నారు. సుమారు 17 మంది మంత్రులు చిన్నమ్మ శశికళకు మద్దతుగా మాట్లాడుతున్నారు. రోజురోజుకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది.
పార్టీపె పట్టు తర్వాత పాలనపై పట్టు సాగించేందుకు శశికళ పావులు
అన్నాడిఎంకె పార్టీపై ఆమె పట్టు సాధించారు. రానున్న రోజుల్లో ఆమె పాలనపై కూడ పట్టు సాగించేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారు. ఈ మేరకు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. పన్నీర్ సెల్వం స్థానంలో ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను చేపట్టే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఆమెను ముఖ్యమంత్రిగా బాద్యతలు స్వీకరించాలని పలువురు పార్టీ సీనియర్లే ఆమెను కోరుతున్నారు. ఆమె ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శశికళ పోటీచేస్తారు
శశికళ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు వ్యూహ ప్రకారంగా వ్యవహారిస్తోంది.జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.అయితే ఈ అసెంబ్లీ స్థానం కాకుండా ఆండీ పట్టీ లేదా నన్నిలం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఓక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. సిఎంగా శశికళ పగ్గాలు చేపట్టాలని పార్టీ సీనియర్లు కూడ ఆమెను కోరుతున్న నేపథ్యంలో ఆమె త్వరలోనే సిఎం పదవిని చేపట్టే అవకాశం లేకపోలేదనే చర్చ సాగుతోంది.చిన్నమ్మ సిఎంగా బాద్యతలు స్వీకరించగానే ఆండిపట్టి సిట్టింగ్ ఎంఏల్ఏ తంగతమిళ్ సెల్వన్, నన్నిలం నుండి ప్రాతినిథ్యం వహిస్తోన్న మంత్రి కామరాజ్ లలో ఎవరో ఒకరు రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు.
పార్టీ సీనియర్లు సమాలోచనలు
ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పన్నీర్ సెల్వం ను తప్పించి శశికళను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని పార్టీ సీనియర్లు కోరుతున్నారు.అయితే సీనియర్ నాయకులు శశికళ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించేందుకు అవసరమైన వ్యూహన్ని సీనియర్లు చేస్తున్నారు. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించడంతో పాటు పాలన పగ్గాలు కూడ కట్టబెడితే రానున్న ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలను చిన్నమ్మ తీసుకొనే అవకాశం ఉందని పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.ఈ దిశగా సీనియర్లు పావులు కదుపుతున్నారు.
సమీక్షలతో బిజీ బిజీగా చిన్నమ్మ
పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ జిల్లాలవారీగా పార్టీలో సమీక్షలను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల క్రితం అధికారికంగా బాద్యతలను స్వీకరించిన తర్వాత ఆమె జిల్లాల వారీగా పార్టీ బలాన్ని సమీక్షిస్తున్నారు. జనవరి 4వ, తేది నుండి 9వ, తేది వరకు జిల్లాల వారీగా మండల, నియోజకవర్గ, డివిజన్, యూనియన్ నాయకులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఏ రోజున ఏ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించనున్నారనే విషయమై ఆమె ఆయా జిల్లాల నాయకులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పార్టీ నాయకులతో చర్చించిన మీదట ఆయా జిల్లాలతో సమీక్షలు నిర్వహించనున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించారు. జిల్లాల సమీక్షకు ముందుగానే ఆమె పార్టీ సీనియర్లతో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.
ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ముహుర్తం కోసం ఎదురుచూపు
పార్టమెంట్ లో పార్టీ నాయకుడు , డిప్యూటీ స్పీకర్ తంబిదురై లాంటి సీనియర్ నాయకుడు చిన్నమ్మకు మద్దతుగా ప్రకటన చేయడంతో ఇతరులు కూడ అదే బాటలో నడుస్తున్నారు. పార్టీలోని సీనియర్లంతా చిన్నమ్మకే పగ్గాలు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు స్వీకరించిన తర్వాత చిన్నమ్మ చేసిన ప్రసంగంతో ఆమెలో నాయకత్వ లక్షణాలు తమకు స్పష్టంగా కన్పించాయని పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చిన్నమ్మ ఏ రోజ ముఖ్యమంత్రిగా బాద్యతలను చేపడుతారోననే పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.