‘అమ్మ’పై అందుకే కుట్రలు, తిప్పికొట్టాలి: శశికళ పిలుపు, వరుస భేటీలు
జయలలిత మృతిపై కుట్రలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వాటిని కలిసి కట్టుగా తిప్పికొట్టాలని శశికళ పిలుపునిచ్చారు
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతిపై కుట్రలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వాటిని కలిసి కట్టుగా తిప్పికొట్టాలని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పిలుపునిచ్చారు. బుధవారం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల నాయకులతో ఆమె సమావేశమయ్యారు.
సమన్వయంతో ముందుకు
‘అమ్మ' లేని ఈ తరుణంలో సమన్వయంతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని శశికళ పార్టీ నేతలకు సూచించారు. ‘అమ్మ' వెలిగించిన దీపం ఆరిపోకుండా కాపాడుకోవాలన్నారు.
ఎంజీఆర్ పేరిట తపాల బిళ్లలు
దివంగత సీఎం ఎంజీఆర్ శతజయంత్యుత్సవాలను సంవత్సరం పొడవునా ఘనంగా నిర్వహించాలని శశికళ సూచించారు. ఎంజీఆర్, జయలలిత జయంత్యుత్సవాల సందర్భంగా తపాలా బిళ్లలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతోపాటు ఎంజీఆర్ బొమ్మ ఉన్న నాణేలను విడుదల చేసేందుకు ప్రయత్నించాలని పిలుపునిచ్చారు.
సేవా కార్యక్రమాలకు పిలుపు
ఎంజీఆర్, జయలలిత జయంత్యుత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ అన్నాడీఎంకే తరఫున వీధి ప్రచారాలు, పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. పాఠశాల స్థాయిలో సాంస్కృతిక, క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. అంతేగాక, వాటిలో గెలిచినవారికి బహుమతులు అందించే కార్యక్రమంలో తానూ పాల్గొననున్నట్లు తెలిపారు. పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపించడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
వరుస సమావేశాలు
పార్టీ అన్ని జిల్లాల నాయకులతో విడతలవారీగా ఈనెల 9 వరకు ఆమె సమావేశం కానున్నారు శశికళ. కాగా, బుధవారం సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తర చెన్నై ఉత్తరం, దక్షిణం, దక్షిణ చెన్నై ఉత్తరం, దక్షిణం, కాంచీపురం పశ్చిమం, తూర్పు, సెంట్రల్, తిరువళ్లూరు తూర్పు జిల్లాల అన్నాడీఎంకే నాయకులు ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
అధినేత్రి కోసం సీఎం కూడా..
ముఖ్యమంత్రి ఓ.పన్నీర్సెల్వంతోపాటు మంత్రులు కూడా అక్కడ శశికళ రాక కోసం సమావేశంలో నిరీక్షించారు. ఉదయం 10.45 గంటలకు శశికళ రాగా ముఖ్యమంత్రి ఓపీఎస్, మంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, ఎస్పీ వేలుమణి, దిండుకల్ శ్రీనివాసన్, తంగమణి తదితరులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. 11 గంటలకు జిల్లా నాయకులతో శశికళ సమావేశమయ్యారు. ఇందులో జయలలిత మృతి తర్వాత పార్టీని నడిపించే విషయమై లోతుగా చర్చించారు.