కేజ్రీ దూరం: బిజెపిలోకి ఆప్ నేత కుమార్ విశ్వాస్?
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. కాగా, బిజెపిలో చేరేందుకు విశ్వాస్ 46వ పుట్టిన రోజు వేడుకనే ముందస్తు వేదిక అయినట్లు తెలుస్తోంది.
బుధవారం కుమార్విశ్వాస్ పుట్టిన రోజు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఆప్ నేతలతో పాటు బిజెపి నేతలు కూడా హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కుమారుడు పంకజ్సింగ్, విజయ్ గోయల్, ఓం మాథూర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఈ వేడుకలో పాల్గొనలేదు. కాగా.. ఈ ఏడాది కనీసం ట్విట్టర్లో కూడా శుభాకాంక్షలు తెలుపలేదు. అయితే ఆప్ నుంచి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మరికొందరు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, నిరుడు కుమార్విశ్వాస్ పుట్టిన రోజు కేజ్రీవాల్, సిసోడియాలు దర్గర ఉండి మరీ జరిపించారు.
దీంతో కుమార్ విశ్వాస్ నిజంగానే బిజెపిలో చేరబోతున్నారని.. అందుకే కేజ్రీవాల్ ఆయనకు దూరంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. తనకు అన్ని పార్టీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వచ్చాయని, అయితే తాను ఏదో ఒక పార్టీలో మాత్రమే చేరతానని కుమార్ విశ్వాస్ ట్వీట్ చేయడం గమనార్హం. మరి కుమార్ విశ్వాస్ బిజెపిలో చేరుతున్నారో లేదో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.