శశికళకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు: 'జయకు తప్పుడు మెడిసిన్స్ ఇచ్చారా'
అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు శశికళకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పార్టీ నాయకులు శశికళ పార్టీ పగ్గాలు చేపట్టాలని తీర్మానాలు చేస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు శశికళకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో పార్టీ నాయకులు శశికళ పార్టీ పగ్గాలు చేపట్టాలని తీర్మానాలు చేస్తున్నారు. ఇప్పటికే శశికళ అనధికారికంగా పార్టీని నడుపుతున్నారు.
మరోవైపు శుక్రవారం నాడు 130 మంది ఎమ్మెల్యేలు పోయెస్ గార్డెన్కు వచ్చి శశికళను కలిశారు. పార్టీ పగ్గాలు చేపట్టాలని అభ్యర్థించారు. ఇప్పటికే శశికళ వారసత్వానికి సంబంధించి తగిన ఆధారాలు ఉన్నాయని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పొన్నయాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
శశికళ కోసం పార్టీ రాజ్యాంగంలో కీలక మార్పులు, జయలలితకూ పదవి!
ఓ వైపు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు పార్టీలో శశికళకు అనుకూలంగా మారుతుండగా.. బయటి వారు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటి గౌతమి, అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించబడిన శశికళ పుష్ప, విపక్ష నేత స్టాలిన్ తదితరులు జయలలిత మృతి పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, జయలలితది హత్యగానే చాలామంది అనుమానిస్తున్నారు. ఇటీవలే ఓ షాకింగ్ విషయం వెలుగు చూసిన విషయం తెలిసిందే. జయలలిత ఆసుపత్రిలో చేరక ముందు తప్పుడు మెడిసిన్స్ అందినట్లుగా తెలుస్తోందనే ప్రచారం సాగింది.
జయ సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరారు. 74 రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. ఆ తర్వాత కన్నుమూశారు. అయితే, ఆసుపత్రిలో చేరకముందు ఆమెకు తప్పుడు డయాబెటీస్ మందులు అందినట్లుగా తెలుస్తోందని ప్రచారం సాగుతోంది.
జయ మరణం వెనుక మిస్టరీ దాగి ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్కాదత్ పంపిన ఓ ఈ మెయిల్ వెలుగుచూడటం చర్చకు దారి తీస్తోంది. ఆమెను అపోలోకు తీసుకు వచ్చే ముందు డయాబెటిస్ ఔషధాలు కాకుండా వేరే ఔషధాలు ఇచ్చినట్లు యాజమాన్యం చెప్పిందని ఆఫ్ ది రికార్డుగా పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.