హిస్టరీ రిపీట్ అవుతుందా : విద్యార్థి ఎన్నికల్లో ఏబీవీపీ గెలుపు..2019లో బీజేపీ గెలుస్తుందా?
Recommended Video
దేశంలో ఎక్కడ ఉపఎన్నికలు జరిగినా... చేదు అనుభవమే ఎదురవుతోంది బీజేపీకి. కానీ ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ కోసం జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనుంబంధంగా ఉన్న విద్యార్థి పార్టీ అఖిలభారతీయ విద్యార్థి పరిషద్ ఏబీవీపీ విజయం సాధించి ఆ పార్టీకి ఊరటనిచ్చింది. ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జాయింట్ సెక్రటరీల పోస్టులు గెలుచుకుంది. మరోవైపు కాంగ్రెస్ అనుబంధ సంస్థ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ పోస్టును గెలుచుకుంది. విద్యార్థి ఎన్నికలు కాంగ్రెస్కు కాస్త నిరుత్సాహాన్ని మిగల్చగా బీజేపీకి మాత్రం మంచి జోష్ను నింపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏపార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తోంది. అయితే ఈ సారి బీజేపీ 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తుందా..?
లోక్సభ ఎన్నికలకు డీయూఎస్యూకు సంబంధం ఏమిటి..?
ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ మరియు లోక్సభ ఎన్నికలకు సంబంధం ఉంది. గత ఐదేళ్లలో ఏ పార్టీ అయితే ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో గెలుపొందిందో అదే పార్టీ లోక్సభ ఎన్నికల్లోను విజయం సాధించింది. 1997,1998,2003,2008,2013లో ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో ఏ పార్టీ అయితే విజయం సాధించిందో ఆ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో అదే పార్టీ గెలుపొందడం విశేషం. ఈసారి డీయూఎస్యూ ఎన్నికల్లో 2013 ఫలితాలే రిపీట్ అయ్యాయి. దీంతో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీనే విజయం సాధిస్తుందని పలువురు ప్రముఖులు జోస్యం చెబుతున్నారు.
2013లో ఏబీవీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష, జాయింట్ సెక్రటరీ పోస్టులను గెలుచుకుంది. ఆ తర్వాత 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజార్టీతో విజయం సాధించింది. నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా బరిలో దిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మొత్తం 325 స్థానాల్లో విజయం సాధించగా అందులో బీజేపీ 282 స్థానాలు గెలుచుకుంది.
1997లో అన్ని స్థానాలు కైవసం చేసుకున్న ఏబీవీపీ
1997లో జరిగిన DUSU ఎన్నికల్లో ఏబీవీపీ అన్ని స్థానాలు అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను గెలిచుకుంది. ఆ వెంటనే 1998లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాజ్పేయి ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఇదిలా ఉంటే 1998లో జరిగిన DUSU ఎన్నికల్లో ఏబీవీపీ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకోగా NSUI వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
2003,2008 DUSU ఎన్నికల్లో NSUI విజయం
2003లో జరిగిన DUSU ఎన్నికల్లో NSUI మొత్తం నాలుగు పోస్టులు అంటే అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టులను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ విజయఢంకా మోగించింది. ఇక 2008లో DUSU ఎన్నికల్లో ఏబీవీపీ కీలక ప్రెసిడెంట్ పోస్టును గెలుచుకున్నప్పటికీ... మిగతా మూడు పోస్టులు కాంగ్రెస్ అనుబంధ సంస్థ NSUI గెలుచుకుంది. వెంటనే 2009 లోక్సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలోకి వచ్చింది.
2013 DUSU ఎన్నికల్లో ఏబీవీపీ జయభేరి
2013 DUSU ఎన్నికల్లో ఏబీవీపీ జయభేరి మోగించింది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జాయింట్ సెక్రటరీ పోస్టులు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కాంగ్రెస్ను పాతాళానికి తొక్కేస్తూ అఖండ విజయం సాధించింది. ఈ సారి DUSU ఎన్నికల్లో ఏబీవీపీ మళ్లీ విజయం సాధించింది. అయితే లెక్క ప్రకారం బీజేపీనే పగ్గాలు చేపట్టాలి. మరి బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉండనున్నాయో... బీజేపీని ప్రజలు ఏమేరకు విశ్వసిస్తున్నారో.. కాంగ్రెస్కు పట్టం కడతారా అనే విషయాలు తెలుసుకోవాలంటే 2019 ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే.