ఫోన్ మాట్లాడుతూ బెంగళూరులో 9వ అంతస్తు నుంచి కిందపడి టెక్కీ మృతి
బెంగళూరు: హోలీ సంబరాల సందర్భంగా బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సంబరాలు జరుపుకుంటున్న 28 ఏళ్ల సాఫ్టువేర్ ఇంజినీర్ తొమ్మిదో అంతస్తు నుంచి కిందపడి కన్నుమూశాడు.
ఈ సంఘటన గురువారం సౌత్ ఈస్ట్ బెంగళూరు, బెల్లండూర్లో జరిగింది. గౌతమ్ కుమార్ ఓ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను మరో ఐదుగురు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటున్నాడు.
రాత్రి 11 గంటల సమయంలో గౌతమ్కు తల్లిదండ్రుల నుంచి ఫోన్ వచ్చింది. అతను బాల్కనీలోకి వెళ్లి మాట్లాడుతున్నాడు. అక్కడి నుంచి పడి మృతి చెందాడు.
4 అడుగులు ఉన్న బాల్కనీ గోడ వద్ద అదుపు తప్పి అతను కిందపడిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత పదిహేను నిమిషాలకు అక్కడున్న స్నేహితులు అతను కిందపడినట్లుగా గుర్తించారు.
వెంటనే సెక్యూరిటీ గార్డు సహాయంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు, ఇతర స్నేహితులకు సమాచారం అందించారు. శుక్రవారం అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇతనిది పాట్నా. సోదరి స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.