3 వ్యవసాయ చట్టాలకు కౌంటర్: రాష్ట్రాల్లో చట్టాలు చేయండి, కాంగ్రెస్ పాలిత సీఎంలతో సోనియా
వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్ష కాంగ్రెస్, ఇతర పార్టీలు.. రైతుల ఆందోళన మిన్నంటుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో నిలువరించాలని సూచించింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో కొత్త చట్టాలు తీసుకురావాలని ముఖ్యమంత్రులకు సోనియా కోరారు. వ్యవసాయ చట్టాలకు ఉభయ సభలు ఆమోదం తెలుపగా.. ఆదివారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా సంతకం చేయడంతో రాజముద్ర పడిన సంగతి తెలిసిందే.
వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం జరుగుతోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను నిలువరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ప్రత్యేకంగా వ్యవసాయ చట్టాలు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ప్రకారం ఆయ రాష్ట్రాలు కొత్త చట్టాలను తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించడానికి ఇంతకన్నా మార్గం లేదని పేర్కొన్నది. వాస్తవానికి విపక్షాలు, రైతులు ఆందోళన చేపడుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్లో నిరసనలు మిన్నంటుతున్నాయి.
Recommended Video
సోనియాగాంధీ సూచనలతో ఆ పార్టీ చట్టాలు చేసి.. కేంద్ర ప్రభుత్వ చట్టాలను నిలువరించే అవకాశం ఉంది. మన దేశంలో సమాఖ్య స్ఫూర్తితో నడుస్తోన్నందున.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు చట్టాలతో రైతులకు అన్యాయం జరుగుతుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అన్నారు.