పుర్రె ఉన్న టోపీ పెట్టుకుంటే ఉగ్రవాది అనుకొని.. పోలీసులకు ఫోన్ చేసి... ప్యాసెంజర్ హల్చల్
ఇద్దరు మాసిన గడ్డంతో రైల్వేస్టేషన్లో తచ్చాడుతున్నారు. వారు పుర్రె గుర్తు ఉన్న టోపీలు పెట్టుకోవడం అనుమానాలకు తావిచ్చింది. వారు ఉగ్రవాదులు అనుకొని ఓ ప్రయాణికుడు భయపడిపోయాడు. అప్పుడే దేశరాజధాని ఢిల్లీ నుంచి శతాబ్ధి ఎక్స్ప్రెస్ రైలు భోపాల్ బయల్దేరింది. ఇంతలో కొందరు ఢిల్లీ పోలీసులకు ఫోన్ చేశారు. ఫోన్ మోగిన వెంటనే అవతలి వ్యక్తి చెప్పే విషయం విని అధికారులు అప్రమత్తమయ్యారు.
శతాబ్ధి ఎక్స్ప్రెస్ అప్పటికే భోపాల్ బయల్దేరింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై మధుర పోలీసులకు సమాచారం అందించారు. అందులో ఇద్దరు అనుమానిత వ్యక్తులు ప్రవేశించారని, వారు ఉగ్రవాదులు అని ఒకరు ఫోన్ చేశారని తెలిపారు. దీంతో మధుర అధికారులు అలర్ట్ అయ్యారు. రైలును నిలిపివేసిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీచేశారు. అనుమానిత వస్తువులు ఏమైనా ఉన్నాయా అని చూశారు. రైలులో విచిత్రంగా ప్రవర్తించిన వారిని గమనించారు. ఎవరూ లేరని తెలుసుకున్నారు.
బాంబ్ డిస్పోజల్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్, జీఆర్ఎఫ్, ఆర్పీఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. శతాబ్ది రైలును నిశీతంగా తనిఖీ చేశారు. అడుగడుగు జల్లెడ పట్టారు. కానీ వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కానీ, వ్యక్తులు కనిపించలేదు. ఏమీ లేదని నిర్ధారించుకున్న తర్వాత రైలు దిగారు. జరిగిన విషయాన్ని అధికారులకు తెలిపారు. తర్వాత రైలు బయల్దేరింది. రైలు పరిశీలించేందుకు దాదాపు 19 నిమిషాల సమయం పట్టింది. తమకు సమాచారం ఇచ్చింది ఫ్రాంక్ కాల్ అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏదీ ఏమైనా కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరూ చేశారనే అంశంపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.