ఇండిగో విమానంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచిన ప్రయాణికుడు!
న్యూఢిల్లీ: విమానంలో జరిగిన మరో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. చెన్నై-తిరుచిరాపల్లి ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) మంగళవారం వెల్లడించింది. గత ఏడాది డిసెంబర్ 10న జరిగిన ఈ సంఘటనను తక్షణమే గమనించామ తెలిపింది. దీనిపై విచారణకు ఆదేశించింది.
డీజీసీఏ అంతకుముందు, విమానం త్రివేండ్రమ్కు బయలుదేరిందని పేర్కొంది. అయితే క్యారియర్ తర్వాత అది తిరుచిరాపల్లికి వెళుతున్నట్లు వివరణ ఇచ్చింది.
ఇండిగో ఫ్లైట్ 6E-7339లో గుర్తు తెలియని ప్రయాణికుడు.. ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. అయితే విమానం ఇంకా టేకాఫ్ కాకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు తెలిపారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి డోర్ తీసిన వ్యక్తి క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు.
ఫ్లైట్ రెగ్యులేటర్ ఈ సంఘటనను గమనించినట్లు ధృవీకరించింది. సీనియర్ డీజీసీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ.. విమానం నేలపై ఉండగానే ప్రయాణికుడు పొరపాటున ఆర్హెచ్ అత్యవసర ద్వారం తెరిచినట్లు తెలుస్తోంది. గమనించిన సిబ్బంది వెంటనే డోర్ ను తిరిగి పునర్ స్థితికి తీసుకొచ్చారు. దీంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి సేఫ్టీ ప్రోటోకాల్తో రాజీపడలేదు' అని పేర్కొన్నారు.
గతంలో శంకర్ మిశ్రా అనే వ్యక్తి గత నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్లో మద్యం మత్తులో 70 ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. మిశ్రా పనిచేసిన అమెరికాకు చెందిన ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది.