గాల్లో అలజడి: విమానం గాల్లో ఉండగా ఈ ప్రయాణికుడు ఏం చేశాడో తెలుసా..?
భువనేశ్వర్ : గాల్లో వెళుతున్న విమానం తలుపు తెరిచేందుకు ఓ ప్రయాణికుడు ప్రయత్నించడంతో విమానంను భువనేశ్వర్లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన హైదరాబాదు నుంచి గౌహతికి వెళుతున్న ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం హైదరాబాదులో ఇండిగో విమానం గౌహతికి టేకాఫ్ తీసుకుంది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే అందులో ప్రయాణిస్తున్న ఇర్షద్ అలీ అనే వ్యక్తి విమానం ప్రధాన డోర్ను తెరిచేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
హైదరాబాదులో సోమవారం ఉదయం 4:50 గంటలకు టేకాఫ్ తీసుకుంది విమానం.ఇక గందరగోళం నెలకొనడంతో విమానంను భువనేశ్వర్లోని బిజూ పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం ల్యాండ్ అవగానే ఇర్షద్ అలీని విమానం సిబ్బంది పోలీసులకు అప్పగించింది. అయితే ఇర్షద్ అలీ మానసిక పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది. అలీ ఒక్కసారిగా తలుపు తీసేందుకు ప్రయత్నించడంతో విమానంలోని ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారని.. అయితే కొంత సేపు ప్రయత్నించి ఆయన్ను సిబ్బంది నిలువరించగలిగిందని విమానాశ్రయం డైరెక్టర్ తెలిపారు.
ఇదిలా ఉంటే ఇర్షద్ అలీతో పాటు వచ్చిన తన సహచరుడు అబ్దుల్ కరీం కూడా భువనేశ్వర్ విమానాశ్రయంలో దిగిపోయారు.హైదరాబాదులోని ఓ ఐస్క్రీం పార్లర్లో ఇర్షద్ పనిచేస్తున్నాడు. శనివారం తన తల్లి మృతి చెందడంతో గౌహతికి హైదరాబాదు నుంచి విమానంలో బయలుదేరాడు. అయితే కేబిన్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించలేదు కాబట్టి అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. ఇర్షద్ గురించి విచారణ చేశామని తను మానసికంగా బాదపడుతున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. విమానంలో గందరగోళ పరిస్థితి సృష్టించినందుకు నిబంధనల ప్రకారం ఆయన్ను విమానం నుంచి బయటకు దించివేయడం జరిగిందని పోలీసులుతెలిపారు. ఇక 6:15 గంటలకు భువనేశ్వర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం... తిరిగి గౌహతికి 7:13 నిమిషాలకు టేకాఫ్ అయ్యింది. ఉదయం 8:30 గంటలకు గౌహతిలో ల్యాండ్ అయ్యింది.