విమాన పైలట్ గైర్హాజరు: 7గంటలపాటు 250మంది ప్రయాణికులకు చుక్కలే!
ముంబై: నగరంలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 250మంది ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. పైలెట్ గైర్హాజరు కావడంతో వారంతా విమానశ్రయంలోనే సుమారు 7 గంటలపాటు నిరీక్షించాల్సి రావడమే ఇందుకు కారణం.
ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లాల్సిన ఏయిర్ఇండియా విమానం శనివారం ఉదయం 1.35 బయలుదేరాల్సి ఉండగా చివరి నిమిషంలో గంట ఆలస్యం అవుతుందని ప్రకటించారు. అనంతరం మరో 7 గంటల వరకు ఎలాంటి స్పందన రాలేదు.
తిండి, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు విమాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు కూడా దిగారు. కాగా, చివరకు సుమారు ఉదయం 8 గంటల ప్రాంతంలో పైలట్ రావడంతో విమానం బయలు దేరింది.
ఈ విషయంపై ఏయిర్ ఇండియా అధికారులను వివరణ కోరగా.. స్పెషల్ ట్రైన్డ్ పైలెట్ గైర్హాజరుతో ఈ సమస్య ఎదురైందని, వేరే పైలెట్ను సద్దుబాటు చేసి 8.20 విమానం టేకాఫ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.