తమిళనాడులో ఆకస్మిక బస్సుల బంద్: తెలుగువారిపై ప్రభావం
Recommended Video
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో గురువారం సాయంత్రం టీఎన్ఎస్టీసీ, ఎస్ఈటీసీ, ఎంటీసీ డ్రైవర్లు, కండకర్లు ఆకస్మికంగా సమ్మెకు దిగారు. వేతనాల పెంపుపై రవాణా శాఖ మంత్రి విజయభాస్కర్తో భేటీ నేపథ్యంలోనే సమ్మె చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ మేరకు సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సమ్మె ప్రకటన వెలువడిన వెంటనే కొందరు డ్రైవర్లు, కండకర్లు బస్సులలోని ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చకుండానే మధ్యలోనే వదిలేసి వెళ్లిపోవడం గమనార్హం. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమిళనాడులో ప్రభుత్వ బస్సుల సమ్మె ప్రభావం తెలుగు ప్రజలపైనా పడింది. చెన్నైకి వెళ్లే తెలుగు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడున్నవారు ఇక్కడికి వచ్చేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగువారితోపాటు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ ప్రజలకు కూడా అవస్థలు తప్పడం లేదు. తమిళనాడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేగానీ సమ్మె విరమించేది లేదని తమిళనాడు కార్పొరేషన్ ఉద్యోగులు చెబుతుండటం గమనార్హం.