షాక్: పాస్పోర్ట్లు ఇక అడ్రస్ ఫ్రూప్ కోసం పనికిరావు, రంగు మారింది
న్యూఢిల్లీ: పాస్ పోర్టులు ఇక అడ్రస్ ప్రూప్గా పనికిరావు. పాస్ పోర్టులో చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపర్చకుండా ఖాళీగా వదిలేయాలని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకొంది. అయితే ఈ విషయమై విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్పోర్టుల జారీ విషయంలో కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై పాస్పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపరచకుండా ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. అది అమలులోకి వస్తే గనుక పాస్పోర్టులు ఇక అడ్రస్ ప్రూఫ్లుగా పనికి రావు.
త్వరలో ఈ నిర్ణయం అమలు చేయబోతున్నట్లు ఎంఏఈ అధికారి సురేంద్ర కుమార్ మీడియాకు చెప్పారు. ఇక నుండి జారీ చేసే పాస్పోర్టుల నుంచే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాతవి గడువు ముగిసేవరకు వినియోగించుకోవచ్చని ఆయన ప్రకటించారు.
రెన్యువల్ సమయంలో వాటికి ఈ మార్పులు వర్తిస్తాయని ఆయన వెల్లడించారు. పాస్పోర్టు విధానంలో మార్పులు రాబోతున్నాయన్న విషయాన్ని పుణే ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జేడీ వైశంపయన్ కూడా దృవీకరించారు.
ప్రస్తుతం పాస్పోర్టు మొదటి పేజీలో ఫోటోతో కూడిన వివరాలుంటాయి. కానీ, చివరి పేజీలో చిరునామా వివరాలను పొందుపర్చేవారు. అయితే తాజాగా తీసుకొన్న నిర్ణయం కారణంగా ఇక చివరిపేజీలో చిరునామా వివరాలు పొందుపర్చరు. ఈ పేజీని ఖాళీగా వదిలేయనున్నారు.
. ఇక పాస్పోర్టు రంగును కూడా మార్చనున్నారు. ప్రభుత్వాధికారులు, సామాన్యులకు వేర్వేరు రంగుల్లో పాస్ పోర్టులను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వాధికారులు, అధికారిక పనుల మీద విదేశాలకు వెళ్లేవారికి తెలుపు రంగు, దౌత్యవేత్తలకు ఎరుపు, మిగతా వారికి నారింజ రంగు పాస్పోర్టులు జారీ చేయనున్నారని సమాచారం.