ఎస్సీ, ఎస్టీ యాక్ట్: అమిత్ షాను కలిసిన పాశ్వాన్, '2019లో మోడీని మార్చేది లేదు, ఆయనే ప్రధాని'
న్యూఢిల్లీ: ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ అధినేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను కలిశారు. ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను వర్తింపచేసేలా కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు.
అలాగే, దళితులకు రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పైన ఆర్డినెన్స్ తీసుకు రావాలన్న తన విజ్ఞప్తికి అమిత్ షా సానుకూలంగా స్పందించారని చెప్పారు. అలాగే, బీహార్కు ప్రత్యేక హోదా అంశంపై కూడా అమిత్ షాతో ఆయన మాట్లాడారు.
చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుతున్నాయని, బీహార్ మాత్రం దానిని పొందేందుకు అర్హత ఉన్న రాష్ట్రమని పాశ్వాన్ అన్నారు. అమిత్ షాతో సమావేశంలో ఈ విషయాన్నీ చర్చించినట్లు తెలిపారు. ఇటు వీరి భేటీలో పాశ్వాన్ తనయుడు చిరాగ్ కూడా పాల్గొన్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘనవిజయం సాధిస్తుందని, రాహల్ గాంధీని ఎవరూ నాయకుడిగా పరిగణించేట్లదని మరో కార్యక్రమ సందర్భంగా రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ప్రతిపక్షాల ఐక్యత కొద్ది కాలమేనని, దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఇలాంటి సీట్ల సర్దుబాట్లు వీలుపడవన్నారు.
2019లో మోడీని మార్చేది లేదు: నక్వీ
2019 ఎన్నికల కోసం ప్రధాని కుర్చీ ఖాళీగా లేదనీ, బీజేపీ అభ్యర్థిగా మోడీయే మళ్లీ ఉంటారని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. ఈసారి అభ్యర్థిని మారుస్తారన్న ఊహాగానాల్లో నిజం లేదన్నారు.
మోడీ వ్యతిరేక కూటమిలో ప్రధాని పదవికి ఆశావహులు రెండు డజన్లకు పైగా ఉన్నారన్నారు. వారు ఏమాత్రం స్థిరత్వాన్ని ఇవ్వలేరన్నారు. దేశంలో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారనీ, వారి హక్కులకు ఎలాంటి భంగం కలగడం లేదన్నారు. మతహింసపరంగా గత నాలుగేళ్లలో చెదురుమదురు ఘటనలు జరిగినా అవి సకాలంలోనే నియంత్రణలోకి వచ్చాయన్నారు.