బాబా రాందేవ్కు షాక్: పతంజలికి రూ.11లక్షల జరిమానా!
సెక్షన్-52,53 నేర అభియోగాల కింద రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థపై రూ.11లక్షల జరిమానా పడింది.
హరిద్వార్: నాణ్యతా ప్రమాణాలను గాలికొదిలేసి, తప్పుడు ప్రకటనల ద్వారా వినియోగదారులను పక్కదోవ పట్టించిందన్న అభియోగాల కింద ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కు చెందిన పతంజలి సంస్థపై రూ.11లక్షల జరిమానా పడింది.
ఇతర సంస్థల ఉత్పత్తులను కూడా తమ సంస్థ ఉత్పత్తులుగా పేర్కొంటూ ప్రకటనలు జారీ చేయడాన్ని కోర్టు తీర్పు తీవ్రంగా తప్పుబట్టింది. తప్పుడు ప్రకటనలు, వినియోగదారులను తప్పుదోవ పట్టించడం, ఆహార నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడం వంటి నేరాలను పరిగణలోకి తీసుకుని సెక్షన్-52,53 కింద జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. జరిమానా మొత్తాన్ని నెల రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.
భవిష్యత్తులో ఇలాంటి తప్పులు మరోసారి పునరావ్రుతం కాకుండా చూసుకోవాలని ఆహార నాణ్యతా ప్రమాణాల శాఖను ఆదేశించింది. కాగా, 2012 ఆగస్టు 16న నిర్వహించిన ఆహార భద్రతా ప్రమాణ పరీక్షల్లో.. పతంజలి సంస్థ ఆ ప్రమాణాలను పాటించడం లేదని అధికారులు గుర్తించారు.
దీంతో అదే ఏడాది నవంబర్ లో పతంజలి ఉత్పత్తుల ప్రమాణాలపై పలు అభియోగాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నెల 1న తీర్పు వెలువరించగా.. ఆలస్యంగా అది వెలుగుచూసింది.