రాం దేవ్ బాబా వర్సెస్ కేంద్రం: ఇమ్యూనిటీ పేరు చెప్పి కరోనాకు మందు..? నోటీసులు జారీ...?
రాందేవ్ బాబా పతంజలి సంస్థ కరోనా వైరస్ నివారణ కోసం కరోనిల్ మందును కనుక్కొన్నామని ప్రకటించడం.. ప్రకటనలు ఇవ్వొద్దని ఆయుష్ మంత్రిత్వ ఆదేశించడంతో వివాదం నెలకొంది. తాము ఐసీఎంఆర్కు చెందిన సీటీఆర్ఐ అనుమతి తీసుకొన్నామని రాందేవ్ బాబా చెప్పడంతో.. లైసెన్స్ అధికారులు స్పందించారు. పతంజలి కరోనిల్ డ్రగ్ తయారీ కోసం అనుమతి అడిగారే తప్ప..ఇదీ కరోనా వైరస్ కోసం ఉపయోగిస్తామని పేర్కొనలేదని స్పష్టంచేశారు. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆయుర్వేద విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
కరోనిల్ మందు రోగనిరోధక శక్తి పెంచేందుకు మాత్రమేనని తమకు సమాచారం అందించారని తెలిపారు. దగ్గు, జ్వరం నివారణ కోసం ఉపయోగిస్తామని నోట్ చేశారని చెప్పారు. కానీ తర్వాత కరోనా వైరస్ కోసం ఉపయోగిస్తామని ప్రకటించడంతో ఆశ్చర్యానికి గురయ్యామని తెలిపారు. దీనిపై పతంజలి సంస్థకు నోటీసు జారీచేస్తామని లైసెన్స్ అధికారి ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు.
Recommended Video
కరోనా వైరస్ కోసం యోగా గురువు రాందేవ్ బాబా కంపెనీ పతంజలి ఆవిష్కరించిన కరోనిల్పై కేంద్రం అభ్యంతరం తెలిపింది. ఆ మందుకు సంబంధించి ప్రచారం చేయొద్దని, వివరాలు నివేదించాలని ఆయుష్ మంత్రిత్వశాఖ కోరింది. దీనికి యోగా గురువు రాం దేవ్ బాబా స్పందించారు. కరోనిల్, స్వసరి మందులు కరోనా వైరస్ రోగులపై వందశాతం పనిచేశాయని పేర్కొన్నారు. కరోనాకు డ్రగ్ తయారుచేసే ముందు అన్నీ అనుమతులు తీసుకున్నామని స్పష్టంచేశారు. డ్రగ్ వివరాలు, అందులో వాడిన మూలికల వివరాలు, పరిమాణానికి సంబంధించి ఇప్పటికే ఆయుష్ మంత్రిత్వశాఖకు అందజేశామని.. అవి త్వరలోనే వారికి చేరుకుంటాయని తెలిపారు. మెడిసిన్కు సంబంధించి కూడా అన్ని వివరాలు మీడియాకు వివరించానని.. తాము చట్టాన్ని ఎక్కడ అతిక్రమించలేదని స్పష్టంచేశారు.