మార్కెట్లోకి పతంజలి పాలు వస్తున్నాయోచ్...! లీటర్ ఎంతో తెలుసా..?
ఢిల్లీ: బాబా రాందేవ్ అనే పేరు వినపడగానే ముందుగా మెదడుకు స్ట్రైక్ అయ్యేది పతాంజలి ఉత్పత్తులు. ఇప్పటి వరకు దాదాపు అన్ని రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించి తమకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న పతంజలి తాజాగా డైరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇకపై పతంజలి డైరీ నుంచి పాలు ఉత్పత్తి కానున్నాయి. త్వరలో ఇవి పతంజలి స్టోర్లలో లభ్యం కానున్నాయి. ఇతర బ్రాండ్ పాలకంటే ఇవి రెండు రూపాయలు తక్కువకే లభ్యంకానున్నాయి.
పడిపోయిన పతంజలి ఉత్పత్తుల సేల్స్
పతంజలి సంస్థ డెయిరీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు బాబా రాందేవ్ గురువారం వెల్లడించారు. ఇందుకోసం 56వేల రీటెయిలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. ఆవుపాలు,పెరుగు , మజ్జిగ, వెన్నను సప్లై చేయనున్నట్లు తెలిపారు. ఇవి ఢిల్లీ నార్త్ సెంట్రల్ రీజియన్ ,ముంబై, పూణే, రాజస్తాన్లలో తొలి విడుతగా సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. ముందుగా టెట్రా ప్యాక్లలో డెయిరీ ఉత్పత్తులను విక్రయిస్తామని చెప్పిన పతంజలి సంస్థ కొన్ని రోజులకు ఫ్లేవర్డ్ మిల్క్ కూడా అందిచనున్నట్లు వివరించింది. ఇక లీటరు పతంజలి పాలు రూ.40కే అందిస్తామని ప్రకటించిన యాజమాన్యం... మార్కెట్లో ఇతర పాల ధరలు లీటరుకు రూ.42గా ఉందని పేర్కొంది.
కొత్త రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా పతంజలి సంస్థ వచ్చే ఏడాదికల్లా ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించనుంది. 2020 కల్లా రూ.1000 కోట్ల రెవిన్యూ తీసుకురాగలమనే ధీమా వ్యక్తం చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రోజు 10 లక్షల లీటర్ల ఆవు పాలను సరఫరా చేసేలా లక్ష్యం నిర్దేశించుకుంది. తొలిరోజున 4 లక్షల లీటర్ల ఆవుపాలు సరఫరా చేసినట్లు కంపెనీ తెలిపింది. ఇక డెయిరీ రంగంలోనే కాక పతంజలి ఘనీభవించిన కూరగాయలను కూడా అమ్ముతోంది. ఇందులో బటానీలు,తీపి మొక్కజొన్న, ఫ్రెంచ్ ఫ్రైస్, దివ్యజల్ పేరుతో తాగునీటి ప్యాకెట్లు కూడా విక్రయిస్తోంది.