కరోనా పేరుతో జనాన్ని భయపెట్టి కోట్లు వెనకేసుకున్న బాబా రామ్దేవ్: జోరుగా కొరొనిల్ సేల్స్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ కొన్ని నెలల పాటు దేశాన్ని స్తంభింపజేసింది. 130 కోట్ల మందిని గడపదాటి అడుగు బయట పెట్టనివ్వకుండా చేసింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల అనేక రంగాలు కుప్పకూలిపోయాయి. ఆయా రంగాలపై ఆధారపడిన లక్షలాది మంది ఉపాథిని కోల్పోయారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనా కరోనా ప్రభావం పడింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.. గాడిన పడుతోంది.
ఇలాంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోనూ యోగా గురు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి సంస్థ కోట్ల రూపాయల మేర వ్యాపార లావాదేవీలను నిర్వహించింది. దీనికి కారణం- ప్రజల్లో కరోనా వైరస్ పట్ల నెలకొన్న భయాందోళనలే. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి ఆయుర్వేద ఔషధాన్ని కనుగొన్నామని ప్రకటించిన పతంజలి సంస్థ.. నాలుగు నెలల కిందట దాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. కొరొనిల్ టాబ్లెట్లు, శ్వాసరివాటి, అనుతైల పేరుతో విడుదల చేసిన ఈ కొరొనిల్ కిట్ల అమ్మకాలు రికార్డు నెలకొల్పాయి.
నాలుగు నెలల కాలంలో 250 కోట్ల రూపాయల మేర లావాదేవీలు నమోదు అయ్యాయి. కరోనా వైరస్ గండం నుంచి గట్టెక్కడానికి విడుదల చేసిన ఈ నాలుగు నెలల స్వల్ప కాలంలోనే ఈ స్థాయిలో అమ్మకాలు నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొరొనిల్ టాబెట్లను మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచి కిందటి నెల 18వ తేదీ వరకు ఏకంగా 25 లక్షల కిట్లు అమ్ముడుపోయినట్లు పతంజలి సంస్థ వెల్లడించింది. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.
ఆన్లైన్, డైరెక్ట్ మార్కెటింగ్, జనరల్ మార్కెటింగ్, పతంజలి డిస్పెన్సరీలు, మెడికల్ షాపుల ద్వారా కొరొనిల్ కిట్లను విక్రయించినట్లు తెలిపింది. కొరొనిల్ కిట్లను ఆవిష్కరించిన తరువాత వాటిపై వివాదం చెలరేగింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థ యాజమాన్యానికి నోటీసులను సైతం జారీ చేసింది. కిట్ ట్రయల్స్కి సంబంధించిన పూర్తి వివరాలను అందిచాలని ఆదేశించింది. ప్రకటనలను కూడా నిషేధించింది.
అనంతరం దాన్ని పతంజలి సంస్థ యాజమాన్యం.. రోగనిరోధక శక్తిని పెంచే బూస్టర్స్గా పేర్కొంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుందంటూ ప్రకటనలను జారీ చేసింది. దీని తరువాత కొరొనిల్ కిట్ల అమ్మకాలపై విధించిన నిషేధాన్ని ఆయూష్ మంత్రిత్వ శాఖ తొలగించింది. అమ్మకాలను చేపట్టడానికి, ప్రచారాన్ని నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. ఫలితంగా- జూన్ 23వ తేదీ నుంచి కిందటి నెల 18వ తేదీ వరకు 25 లక్షల కొరొనిల్ కిట్లు అమ్ముడుపోయాయి. వాటి ద్వారా 250 కోట్ల రూపాయలను పతంజలి సంస్థ ఆర్జించింది.