పటేళ్ల ఆందోళన: శాంతంగా ఉండాలని ప్రధాని విజ్ఞప్తి
న్యూఢిల్లీ: గుజరాత్లో పటేల్ సామాజిక వర్గ ప్రజలు తమను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అహ్మదాబాద్లో ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనపై ప్రధాని మోడీ స్పందించారు. ఆందోళనలు, హింసాత్మక వాతావరణం సృష్టించడం వల్ల ఎవరికీ మేలు జరగదని ఆయన పేర్కొన్నారు.
శాంతియుత వాతావరణం నెలకొల్పండని ఆందోళనకారులకు మోడీ సూచించారు. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ హార్దిక్ పటేల్ అనే 21 ఏళ్ల యువకుడి నాయకత్వంలో ఉద్యమం మొదలైంది. తొలుత శాంతియతంగా మొదలైన ఈ ఉద్యమం అనంతరం కొంత హింసాత్మక రూపం దాల్చింది.
పలు చోట్ల వాహనాలు తగులబెట్టారు. అక్కడక్కక ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా పటేల్ సామాజిక వర్గ ప్రజలు గుజరాత్ బంద్కు బుధవారం పిలుపునిచ్చారు. గుజరాత్లోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది.
బంద్ నేపథ్యంలో పటిదార్ అరక్షన్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్ను అంతకు ముందు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ ఘటనల నేపథ్యంలో కొన్ని చోట్ల అల్లర్లు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ముందుస్తు చర్యలో భాగంగా ప్రత్యేకంగా ఐదువేల బలగాలను దించింది.
ఈ క్రమంలో అందరూ శాంతియుతంగా ఉండాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. మరోవైపు, హార్దిక్ పటేల్ ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హింసకు పాల్పడటం తమ ఉద్దేశం కాదని, తమ డిమాండ్ను అమలుచేయాలని శాంతియుతంగానే కోరుతున్నామని చెప్పారు. ప్రభుత్వమే అనవసరంగా పోలీసులను దించి తమపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు.