గుజరాత్: అల్లర్లలో పోలీసుల పాత్ర కూడా(వీడియో)
గాంధీనగర్: పటేల్ సామాజికవర్గానికి ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో యువ నాయకుడు హార్దిక్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ప్రదర్శన గుజరాత్ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పటిదాకా తొమ్మిది మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
కాగా, రాష్ట్ర వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ వ్యాప్తంగా పోలీసులు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న అహ్మదాబాద్లో అల్లర్లకు ఆజ్యం పోసింది ఎవరన్న విషయంపై హార్డిక్ పటేల్ అనుచరులు ‘పటేల్ కోటా వార్' పేరిట ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది. అసలు ఈ వీడియోలో ఏముందుంటే, ఓ కాంపౌండ్లోకి మూకుమ్మడిగా చొరబడ్డ పోలీసులు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాలపై ప్రతాపం చూపారు. చేతిలో ఉన్న కర్రలతో పాటు కొందరు ఏకంగా తుపాకుల మడమలతో కార్లపై విరుచుకుపడ్డారు.
అంతటితో ఆగ్రహం చల్లారని గుజరాత్ ఖాకీలు అక్కడ నిలిపి ఉన్న టూవీలర్లను కిందపడేశారు. చేతికందిన రాళ్లను కార్లపైకి విసిరేశారు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సదరు సీసీటీవీ ఫుటేజీలను ఎలాగోలా సంపాదించిన హార్దిక్ అనుచరులు దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ప్రజల ఆస్తులను కాపాడాల్సిన పోలీసులే ఇలా రాత్రివేళ వచ్చి ఉద్రిక్తతలను మరింత పెంచేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న గుజరాత్ హైకోర్టు విచారణకు ఆదేశించింది.