'ఉగ్ర' దాడి: ఎన్ఎస్ఏ అత్యవసర భేటీ, హై అలర్ట్
పఠాన్కోట్: ఈరోజు ఉదయం పఠాన్కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రవాదుల మెరుపు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెల్లవారకముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగిపోయారు. ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో ఆయన ఉన్నతాధికారులతో అత్యసవసరంగా భేటీ అయ్యారు.
ఆపరేషన్ మొత్తాన్ని సమన్వయం చేస్తున్నారు. ఉగ్రవాదుల దాడి, అనంతర పరిణామాలపై ఆరా తీస్తున్నారు. పెద్ద ఎత్తున బలగాలను పఠాన్కోట్లో మోహరించారు. భారత భద్రతాదళాల్లోనే అత్యున్నత నైపుణ్యం కలిగిన ఎన్ఎస్జీ, గరుడ కమాండో ఫోర్స్ దళాలు ఉగ్రవాదులపై కౌంటర్ ఎటాక్లో పాల్గొంటున్నాయి.
అంతేకాదు గత రెండు రోజులుగా చోటు చేసుకున్న ఘటనలపై ఆయన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాక పఠాన్కోట్ ఎయిర్బేస్పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో మరిన్ని దాడులు చోటుచేసుకోకుండా ఉండేలా ఆయన అధికారులకు సూచనలు చేశారు.
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆదేశాలతో ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. విమానాశ్రయానికి వస్తున్న వారిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత కాని లోపలికి అనుమతించడం లేదు.
శనివారం ఉదయం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఉగ్రదాడి మొదలు కాగా, 6-6.30 గంటల మధ్యలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చారు. మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆ తర్వాత హతమార్చారు. మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల్లో నలుగురిని హతమార్చారు. ఈ ఉగ్రవాద కాల్పుల్లో ఒక ఎయిర్ ఫోర్స్ అధికారి మృతి చెందినట్లు తెలుస్తోంది.
హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించామని, ఇప్పటికే అక్కడున్న భద్రతా దళాలకు వాటిని సహాయంగా అందుబాటులో ఉంచుతున్నామని డీఐజీ విజయ్ ప్రతాప్ సింగ్ చెప్పారు. ఉగ్రదాడి కారణంగా పంజాబ్లోని లూథియానా ప్రాంతంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.