ఎన్ఐఏ ఎదుట పంజాబ్ ఎస్పీ: ఈరోజే లైడిటెక్టర్ పరీక్ష
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్లోని గురుదాస్ పూర్ ఎస్పీ సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఎదుట హాజరయ్యారు. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రదాడి ఘటనకు ముందు తనను అపహరించినట్లు చెబుతున్న ఎస్పీ సల్వీందర్ సింగ్ మాటల్లో పొంతన లేకపోవడంతో ఎన్ఐఏ అధికారులు ఆయన్ని అనుమానిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో విచారణకు హాజరుకావాల్సిందిగా సల్వీందర్ సింగ్కు ఎన్ఐఏ నోటీసులు జారీ చేయడంతో ఈరోజు ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చారు. ఆయన నుంచి నిజానిజాల్ని రాబట్టడానికి ఈరోజు ఆయనకు లైడిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం ఉంది.
పఠాన్కోట్ ఉగ్రదాడికి ముందు సల్వీందర్ సింగ్తో పాటు కిడ్నాప్కు గురైన ఆయన స్నేహితుడు రాజేశ్, వంటమనిషి మదన్గోపాల్, కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని ఆయన చెప్పారు.
అంతేకాదు తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. ఆ తర్వాత ఎన్ఐఏ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో పఠాన్కోట్ ఉగ్రదాడిలో పోలీసులు ఆయన్ని అనుమానిస్తున్నారు.
కాగా, పఠాన్కోట్ ఎయిర్ బేస్పై ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ మూడు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇటీవల జరిగిన ఈ దాడిలో ఏడుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు ఉగ్రవాదులు హతమైన సంగతి తెలిసిందే.