పఠాన్కోట్ దాడి: పాక్కు ఎల్ఆర్ పంపనున్న భారత్
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుకున్న కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టాలని పాకిస్థాన్ను భారత్ కోరింది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రొగేటరీ(ఎల్ఆర్) పంపనుంది.
సైనిక ఆపరేషన్లో హతమైన ఉగ్రవాదుల డిఎన్ఏ నమూనాలు, ఫోన్ కాల్స్ తదితర వివరాలను పాకిస్థాన్కు భారత్ అందజేయనుంది. పఠాన్కోట్లో సైనిక బలగాల చేతిలో హతమైన ఆరుగురు ఉగ్రవాద మృతదేహాలకు వీలైనంత త్వరగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.
అంతేగాక, పాకిస్థాన్లోని సూత్రధారుల నుంచి ఉగ్రవాదులకు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలు ఎల్ఆర్ ద్వారా పొరుగు దేశానికి పంపించనుంది. ఈ వివరాలతో కుట్రదారులను పట్టుకోవాలని పాక్ ప్రభుత్వ వర్గాలకు భారత్ అధికారికంగా విజ్ఞప్తి చేయనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇది ఇలా ఉండగా, పఠాన్కోట్ ఉగ్రవాద దాడిని అమెరికా ఖండించింది. పాకిస్థాన్ ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరించాలని, వారిని అంతం చేయాలని పిలుపునిచ్చింది. కాగా, పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్.. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి పఠాన్కోట్ ఘటనపై మాట్లాడారు. ఘటనకు పాల్పడిన ఉగ్రవాదులపై కఠినంగా వ్యవహరిస్తామని హామి ఇచ్చినట్లు తెలిసింది.