పఠాన్కోట్ దాడి: ఐఎస్ఐ హానీట్రాప్లో ఎస్పీ?
న్యూఢిల్లీ: పఠాన్కోట ఉగ్రవాదుల దాడిలో పంజాబ్ పోలీసాఫీసరు సల్వీందర్ సింగ్ది కీలక పాత్రగా అనుమానిస్తున్నారు. అతని వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్పీ సల్వీందర్ సింగ్ పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ కోసం, ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కోసం పనిచేస్తూ ఉండవచ్చునని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్లు ఫస్ట్పోస్ట్ మీడియా రాసింది.
సల్వీందర్ సింగ్, అతని వంట మనిషి మదన్ గోపాల్, అతని మిత్రుడు రాజేష్ వర్మను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రశ్నించింది.
తనను, తన మిత్రుడు రాజేష్ వర్మను, వంటమనిషిని పఠాన్కోటకు 25 కిలోమీటర్ల దూరంలో గల కోలియా గ్రామం వద్ద నలుగురైదుగురు సాయుధ ఉగ్రవాదులు డిసెంబర్ 31వ తేదీన వాహనాన్ని ఆపి తమను కిడ్పాన్ చేశారని సల్వీందర్ సింగ్ తొలుత చెప్పాడు.
పఠాన్కోట ఎయిర్బేస్పై ఉగ్రవాదుల దాడి జనవరి 2వ తేదీ తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో జరిగింది. అయితే, సల్వీందర్ సింగ్ మాటలను తొలుత ఆయన సీనియర్ అధికారులు తీవ్రంగా పరిగణనలోకి తీసుకోలేదు.
అయితే, సిఎన్ఎన్ - ఐబిఎన్ కథనం ప్రకారం - సింగ్ను ఐఎస్ఐ హానీట్రాప్లో పడేసింది. పఠాన్కోట దాడిలో సింగ్ది కీలకమైన పాత్ర అని, అతని ఉగ్రవాదులకు అవసరమైన సమాచారాన్ని అందించి ఉంటాడని ఆ చానెల్ ఆరోపించింది. పఠాన్కోట దాడిలో ఆరుగురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుపెట్టారు. కాగా, ఏడుగురు భద్రతాధికారులు ఈ దాడిలో అమరులయ్యారు.