పాక్ డ్రోన్ల కలకలం: పఠాన్కోట్లో హైఅలర్ట్
ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట్లో మరోసారి హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్లు సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఆ డ్రోన్లు చక్కర్లు కొడుతూ మన దేశ భూభాగంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, నకిలీ కరెన్సీ, డ్రగ్స్ను జారవిడుస్తుండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో దేశ భద్రతా దళాలు, పంజాబ్ రాష్ట్ర పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. పంజాబ్-హిమాచల్ప్రదేశ్-పాకిస్థాన్ సరిహద్దును పంజాబ్ పోలీసులు జల్లెడపడుతున్నారు. పంజాబ్, పఠాన్కోట్లో మీదుగానే పాక్ డ్రోన్లు సరిహద్దును దాటి దేశంలోకి ప్రవేశించే అకాశం ఉండటంతో వాటిని తిప్పికొట్టేందుకు నిఘాను పటిష్టం చేశారు.
పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ పోలీసులు హిమాచల్ప్రదేశ్ అటవీ ప్రాంతంలో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ సోదాలు పఠాన్ కోట్, నూర్పూర్ డీఎస్పీల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఇల్లు, స్థావరాలను కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను విచారిస్తున్నారు.
అక్టోబర్ నెలలో పర్వదినాలు ఉండటంతో హైఅలర్ట్ ప్రకటించామని డీఎస్పీ రాజేందర్ మీడియాకు తెలిపారు. సరిహద్దు ప్రాంతంలో దాడులు చేసే అవకాశం ఉండటంతో నిఘాను పటిష్టం చేశామని, సోదాలు నిర్వహిస్తున్నామని వివరించారు.