నిర్భయ దోషులకు 20న ఉరిశిక్ష అమలు ఖరారు: దోషుల ప్లీని కొట్టేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యకు పాల్పడిన దోషులకు ఉరిశిక్ష అమలు ఖరారైపోయింది. తాజాగా, ఉరిశిక్షను నిలిపివేయాలంటూ నిర్భయ దోషులు పెట్టుకున్న పిటిషన్ను పాటియాల హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జీ ధర్మేందర్ రాణా గురువారం కొట్టివేసింది.
సుప్రీంకోర్టు కూడా నిర్భయ దోషులు వేసుకున్న క్యూరేటివ్ పిటిషన్ను కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో నలుగురు నిర్భయ దోషులకు మార్చి 20న తెల్లవారుజామున 5.30గంటలకు ఉరిశిక్ష అమలు కానుంది. ఇప్పటికే తీహార్ జైలు అధికారులు ఉరితీతకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.
సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు
నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉరిశిక్షపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ధర్మాసనం తోసిపుచ్చింది. నిర్భయపై లైంగికదాడి జరిగిన సమయంలో తాను మైనర్ అని పవన్ గుప్తా పేర్కొన్నారు. కానీ దీనిని కింది కోర్టులు విస్మరించాయని సర్వోన్నత ధర్మాసనం దృష్టికి ఆయన తరఫు న్యాయవాది తీసుకెళ్లారు. దీంతో పవన్కు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరారు.
నిర్భయ కేసులో ఉరిశిక్షపై పవన్ కుమార్ గుప్తా రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేశాడు. అయితే సర్వోన్నత ధర్మాసనం అతని అప్పీల్ను కొట్టివేసింది. పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను గురువారం ఆరుగురు సభ్యులు గల ధర్మాసనం విచారించి.. అతని అభ్యర్థనను తోసిపుచ్చింది.
అంతకుముందు జరిగిన పరిణామాలు
మరణశిక్ష అమలు వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు ముకేశ్ సింగ్(32), వినయ్ శర్మ(26), అక్షయ్ ఠాకూర్(31), పవన్ గుప్తా(25) ఇప్పటికే చేయని ప్రయత్నం లేదు. న్యాయపరమైన అవకాశాల పేరిట ఉరిని తప్పించుకునేందుకు ఉన్న ఛాన్సులన్నీ వాడుకున్నారు. ఆ తర్వాత మరణశిక్ష ఖాయం కావడంతో తమకు న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టు తిరస్కరించింది.
Recommended Video
ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష అమలును నిర్భయ దోషులు వాయిదా వేయించారు. న్యాయపరమైన అవకాశాలు కూడా లేకపోవడంతో మార్చి 20న ఈ దుర్మార్గులకు ఉరిఖాయమవుతుందన్న తరుణంలో మరోసారి ఇలాంటి పిటిషన్లు వేస్తూ శిక్షను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. తమకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ అంతర్జాతీయ కోర్టులో నిర్భయ దోషుల తరపున న్యాయవాది ఏపీసింగ్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.