కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్లపై పటీదార్లు గుజ్జర్లు ఏమంటున్నారంటే..?
తమ కులానికి రిజర్వేషన్లు వర్తింపజేయాలంటూ పలు కులసంఘాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం నిన్న ఆర్థికంగా వెనకబడిన అగ్రకులాలవారికి 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన తీర్పును స్వాగతించారు పటిదార్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్. అయితే ప్రభుత్వం దీన్ని ఎలా అమలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయంను స్వాగతిస్తూనే మరోవైపు ఇది ఎన్నికల ముందు విసిరిన తాయిలం అని విమర్శించారు హార్ధిక్ పటేల్. ఇదే బాటలో పలు రిజర్వేషన్ పోరాట నేతలు కూడా నడుస్తున్నారు.వీరంతా కేంద్రం ప్రకటించిన 10శాతం రిజర్వేషన్ను ఎన్నికల తాయిలంగానే చూస్తున్నారు.
ఇది కేవలం ఎన్నికల స్టంట్
2014 ఎన్నికలకు ముందు కూడా బీజేపీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని... ప్రతి పౌరుడి బ్యాంక్ అకౌంటులో రూ. 15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని గుర్తు చేశారు హార్దిక్ పటేల్. రిజర్వేషన్ల వర్తింపునకు రాజ్యాంగ సవరణ చేస్తే దాన్ని తాము ఆమోదిస్తామని అయితే కేవలం ఎన్నికల తాయిలంగా చూపిస్తే మాత్రం సహించబోమని హార్ధిక్ పటేల్ హెచ్చరించారు. 2017 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న మరో నేత రేష్మ పటేల్ 2019 ఎన్నికలకు ముందే రిజర్వేషన్లు వర్తించేలా రాజ్యాంగ సవరణ చేస్తే దాన్ని తను స్వాగతిస్తానని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం జాప్యం చేసి లోక్సభ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని చెబితే ఆ చర్యను ఎన్నికల తాయిలంగానే భావించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
బీజేపీలో ఏకాభిప్రాయం లేదన్న యష్పాల్ మాలిక్
పటేళ్లను ఓబీసీల్లో చేర్చాలని హార్దిక్ పటేల్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇతర వర్గాల వారినుంచి కూడా రిజర్వేషన్లపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జాట్లు కూడా హర్యానాలో తమ గొంతును వినిపిస్తున్నారు. ఆలిండియా జాట్ ఆరక్షణ్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు యష్పాల్ మాలిక్ కూడా కేంద్రానిది ఎన్నికల స్టంట్ అనే అభివర్ణించారు. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, గుజరాత్లలో జాట్లకు ఓబీసీ కింద రిజర్వేషన్ దక్కుతోందని హర్యానాలో అది జరగడం లేదని అన్నారు. అయితే రిజర్వేషన్ అని చెబుతున్న కేంద్రం వారిని ఓబీసీ కోటాలో చేర్చుతుందా లేక కొత్తగా తెలిపిన 10శాతం కిందకు చేర్చుతుందా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని నోటిఫికేషన్ విడుదలైన తర్వాత స్పందిస్తామని యష్పాల్ మాలిక్ తెలిపారు.
ఇక మహారాష్ట్రలో రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్న మరాఠా క్రాంతి మోర్చ నేత నానాసాహెబ్ కూటే కూడా కేంద్రం ప్రకటించిన రిజర్వేషన్లు ఎన్నికల జుమ్లాగానే తాము చూస్తున్నట్లు వెల్లడించారు. రిజర్వేషన్లను ప్రకటించిన బీజేపీ ఏకాభిప్రాయంతో లేదని చెప్పిన కూటే... మహారాష్ట్రలో మరాఠా సామాజికవర్గానికి ప్రభుత్వం 16శాతం రిజర్వేషన్లు ఇస్తుండగా... కేంద్రం అదనంగా 10 శాతం ఇవ్వడాన్ని చూస్తే ఇది కోర్టులో చాలామంది పిటిషన్ దాఖలు చేసే అవకాశముందని జోస్యం చెప్పారు.
9వ షెడ్యూల్లో చేర్చకుంటే ఉపయోగం ఉండదు
రాజస్థాన్లో గుజ్జర్ నేత కిరోరి సింగ్ భైంస్లా మరో వాదన వినిపించారు. ఇప్పటికే రిజర్వేషన్లపై ఉన్న 50శాతం సీలింగ్ను దాటేశారని అయితే గుజ్జర్లకు ప్రత్యేక వెనకబడిన తరగతుల కింద రిజర్వేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. 2013లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ జాట్లకు రిజర్వేషన్లు కల్పించిందని.. అయితే దాన్ని సుప్రీం కోర్టు కొట్టివేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు మరో నేత హిమ్మత్ సింగ్. ఇది కేవలం ఎన్నికల తాయిలంగానే భావిస్తున్నామని చెప్పిన హిమ్మత్ సింగ్... రాజ్యాంగంలోని 9వ షెడ్యూలు గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేరుస్తామని మాత్రం చెప్పడం లేదని ధ్వజమెత్తిన హిమ్మత్ సింగ్ అంశాన్ని 9వ షెడ్యూలులో చేర్చకుంటే ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు.