పాట్నా తొక్కిసలాట: ఈవ్టీజింగ్, బతకడం అద్భుతమని
పాట్నా: అక్టోబర్ 3వ తేదీన బీహార్లో దసరా పర్వదినం నాడు తొక్కిసలాట జరిగి 33 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అధికారుల నిర్లక్ష్యం, ఈవ్ టీజింగ్, వదంతుల వల్లనే తొక్కిసలాట జరిగిందని బాధితులు, సాక్షులు చెబుతున్నారు. గాంధీ మైదానంలోని దక్షిణం వైపున ఉన్న గేటు వద్ద కొందరు మహిళలను, యువతులను వేధించారని, అప్పుడు కొందరు కిందపడ్డారని.. రావణ వధ చూసేందుకు దల్దాలి నుండి వచ్చిన జ్యోతి కుమారి బహిరంగ విచారణలో చెప్పారు.
ఈ సమయంలో తాను కూడా కిందపడ్డానని, తన పైన పలువురు మహిళలు పడ్డారని చెప్పారు. ఈ ఘటనలో తన ఏడాది కూతురు కనిపించకుండా పోయిందన్నారు. తన అత్తగారికి గాయాలయ్యాయని చెప్పారు. కాసేపటికి తాను పైకి లేచి, తన కూతురు కోసం వెతికానని, దాదాపు గంట అనంతరం తన కూతురు కనిపించిందని, ఎవరో తన కూతురును పైకి లేపి ఫుట్ పాత్ పైన కూర్చుండబెట్టినట్లుగా అర్థమైందని జ్యోతి కుమారి చెప్పారు.
కొందరు యువకులు బలవంతంగా లోపలకు చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నించారని, దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని మరో సాక్షి ప్రియదర్శి తెలిపారు. ఆ సమయంలో అక్కడ పోలీసులు ఎవరు లేరని తెలిపారు. తాము కొద్ది గాయాలతో అక్కడి నుండి బయటపడ్డామని చెప్పారు. ఘటన జరిగినప్పుడు లైట్ లేదని, అలాగే పోలీసులు కూడా లేరని ఆశా దేవి చెప్పారు.
తొక్కిసలాటలో తాను కూడా కింద పడిపోయానని, అయితే, తాము బతికి బయటపడటం ఓ అద్భుతమేనని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రిక్ వైర్ కింద పడిందనే వదంతులు కూడా ఈ తొక్కిసలాటకు కారణమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా సాక్షులు ఇచ్చిన సమాచారంతో త్వరలో అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. మరోవైపు, బాధితులు వచ్చిన సమయంలో అందుబాటులో లేని పాట్నా వైద్య కళాశాలకు చెందిన 8 మంది వైద్యులపై బీహార్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.