Patanjali కరోనిల్ టాబ్లెట్ కరోనాకు విరుగుడా..? ఆయుష్ ఏం చెబుతోంది..?
ఉత్తరాఖండ్ : కరోనావైరస్కు మందు కరోనిల్ అని చెప్పుకున్న పతంజలి సంస్థకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. కరోనా వైరస్కు కరోనిల్ కేవలం సప్లిమెంట్లానే పనిచేస్తుంది తప్ప... విరుగుడు కాదని తేల్చి చెప్పేసింది. అంటే కరోనిల్ కేవలం విటమిన్ సీ, జింక్ ఇతర మల్టీ విటమిన్ పిల్స్లా మాత్రమే పనికొస్తుందని స్పష్టం చేసింది. గతవారమే కరోనిల్ టాబ్లెట్ను తిరిగి ప్రవేశపెట్టింది పతంజలి సంస్థ. అంతేకాదు కరోనా చికిత్సలో కరోనిల్ మంచి పాత్ర పోషిస్తుందని స్వయంగా మోడీ ప్రభుత్వమే చెప్పిందని పతంజలి సంస్థ పేర్కొంది. అంతకుముందు ఈ ఔషధాన్ని రోగనిరోధక శక్తి పెంపొందించే మందుగా గుర్తించడం జరిగింది.
పతంజలి కరోనిల్పై ఆయుష్ ఏం చెబుతోంది..?
కరోనిల్ అనే ఈ టాబ్లెట్ కోవిడ్-19 విరుగుడుకు అసలు సిసలైన మందు అని, అన్ని ఆధారాలతో ధృవీకరించడం జరిగిన తొలి ఔషధమని పతంజలి వ్యవస్థాపకులు బాబా రాందేవ్ అంతకుముందు చెప్పారు. ఇదిలా ఉంటే చికిత్సలో భాగంగా ఉపయోగపడే ఒక టాబ్లెట్ ఎప్పటికీ వ్యాధికి విరుగుడుగా పరిగణించలేమని ఉత్తరాఖండ్ లైసెన్సింగ్ అథారిటీ డాక్టర్ వైయస్ రావత్ మంగళవారం స్పష్టం చేశారు. విటమిన్ సీ, జింక్, ఇతర విటమిన్లలా ఇది కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో మాత్రమే పనికొస్తుంది తప్ప విరుగుడుకు కాదని చెప్పారు. ఇదిలా ఉంటే డాక్టర్ రావత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎందుకంటే పతంజలి హెడ్క్వార్టర్స్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్నాయి. అంతేకాదు కరోనాకు విరుగుడుగా ప్రచారం చేయొద్దని చాలా కచ్చితంగా పతంజలి సంస్థకు ఆదేశాలు ఇచ్చినట్లు డాక్టర్ వైయస్ రావత్ చెప్పారు.
చికిత్స కోసం కరోనిల్ టాబ్లెట్ వాడొచ్చా..?
ఇదిలా ఉంటే ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి రావత్కు ఓ లేఖ వెళ్లింది. కేవలం రోగనిరోధక శక్తి పెంపొందించే స్థాయి నుంచి సపోర్టింగ్ ట్రీట్మెంట్లో భాగంగా కరోనిల్ వినియోగించొచ్చని మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. అంతేకాదు ఈ మేరకు కరోనిల్కు లైసెన్స్ ఇవ్వాల్సిందిగా లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే చికిత్సలో కానీ, కరోనావైరస్కు విరుగుడు కరోనిల్ కాదని స్పష్టంగా పేర్కొంది. ఇక కరోనాకు విరుగుడు కరోనిల్ అనే ప్రచారం చేయకుండా పతంజలి సంస్థపై ఓ కన్నేసి ఉంచుతామని రావత్ పేర్కొన్నారు.
కరోనిల్కు అనుమతి ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు
ఇక పతంజలి తీసుకొచ్చిన కరోనిల్ పై అనేక అనుమానాలు నివృత్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ ఔషధంకు అనుమతులు ఇవ్వడంపై చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ డిప్యూటీ సలహాదారుడు డాక్టర్ చింతా శ్రీనివాసరావుకు పతంజలి గతంలో ఓ లేఖ రాసింది. కరోనిల్ టాబ్లెట్ను రోగనిరోధక శక్తి పెంపుదల నుంచి కోవిడ్-19కు ఔషధంగా గుర్తింపునిస్తూ లైసెన్స్ ఇవ్వాలంటూ లేఖలో కోరింది. అయితే దీనిపై అంతర్గత కమిటీ పరిశీలన చేసి రెండు అంశాలను ప్రస్తావించింది. ఎంత వయసున్న వారు ఈ మాత్ర వేసుకోవచ్చు, ఇతరత్రా సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా ప్రస్తావన లేదని చెబుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవన్నీ అనుమానాలు ఉండగానే కమిటీ ఆమోదం తెలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై మాట్లాడేందుకు అంతర్గత కమిటీలోని సభ్యులు కూడా నిరాకరించారు.