కాశ్మీర్ లో సైన్యానికి మద్దతుగా రాళ్ళురువ్వేందుకు శిక్షణ ఇస్తోన్న 'జనసేన'
కాశ్మీర్ లో ఆర్మీ అధికారులపై రాళ్ళు రువ్వుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే అల్లరిమూకలపై రాళ్ళు రువ్వేందుకు జనసేన కార్యకర్తలు సిద్దమయ్యారు.
కాన్పూర్: కాశ్మీర్ లో ఆర్మీ అధికారులపై రాళ్ళు రువ్వుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించే అల్లరిమూకలపై రాళ్ళు రువ్వేందుకు జనసేన కార్యకర్తలు సిద్దమయ్యారు.ముల్లును ముల్లుతోనే తీయాలనే భావనతో ఈ చర్యకు సిద్దమైంది జనసేన.
కాశ్మీర్ లో తరచూ ఆర్మీపై, పోలీసులపై అల్లరిమూకలు దాడులకు పాల్పడుతుంటాయి.అంతేకాదు రాళ్ళురువ్వుతుంటాయి.ఈ నేపథ్యంలో అల్లరిమూకలకు చెక్ పెట్టేందుకుగాను రాళ్ళు రువ్వే అల్లరిమూకలపై రాళ్ళురువ్వాలని నిర్ణయం తీసుకొంది జనసేన.
ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ లో జనసేన కొంతకాలంగా శిక్షణ ఇస్తోంది. ఆర్మీకి సహాయంగా అల్లరిమూకలపై రాళ్ళను ఎలా రువ్వాలో శిక్షణ ఇస్తోంది. గంగా నది కాలువ పక్కనే రెండు గడ్డిబొమ్మలను ఏర్పాటు చేసి వాటికి తగిలేలా రాళ్ళురువ్వడంలో యువతీ యువకులకు శిక్షణ ఇచ్చినట్టు జనసేన వ్యవస్థాపకుడు అరుణ్ పూరి చైతనాయ్ తెలిపారు.
పాకిస్తాన్ చావాలంటూ శిక్షణ పొందుతున్న కార్యకర్తలు నినాదాలు చేస్తూ గడ్డిబొమ్మలపై రాళ్ళు రువ్వుతారు.కాశ్మీర్ లో అల్లరిమూకలను ఎదుర్కొనేందుకు తమ కార్యకర్తలు వెయ్యిమంది సిద్దమయ్యారని అందుకు అనుమతించాలని జనసేన ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు స్థానిక అధికారులను కూడ కోరింది. అదివారం సాయంత్రం వరకు వారికి అనుమతిరాలేదు.
అయితే కాశ్మీర్ కు వెళ్ళేందుకు వారు సిద్దం కావడంతో పోలీసులు వారిని అడ్డుకొన్నారు. తమకు అనుమతి లేకపోయినా సరే వ్యక్తిగత స్థాయిలో కాశ్మీర్ కు వెళ్ళి తమ వెంట ట్రక్కుల్లో రాళ్ళు వస్తాయన్నారు.