పవన్.. ఇబ్బంది ఉంటే పార్టీ వీడి పో, ఏ పార్టీలో చేరినా నో ప్రాబ్లం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జేడీయూలో విభేదాలను తీసుకొచ్చాయి. హస్తిన ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామని ఆ పార్టీ చీఫ్, బీహర్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. దీనిని ఆ పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి పవన్ వర్మ వ్యతిరేకించారు. పార్టీ అధినేత నితీశ్ కుమార్కు లేఖ రాసి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రోల్ అవుతోంది. దీనిపై నితీశ్ కుమార్ స్పందించారు.
సైద్ధాంతిక విభేదాలు..
తమ పార్టీ సిద్ధాంతాలు బీజేపీతో ఎలా కలుస్తాయని పవన్ వర్మ లేఖలో నితీశ్ కుమార్ను ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్పై బీజేపీతో కలిసి ఎలా ముందుకుసాగుతామని సందేహం లేవనెత్తారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరలై.. చివరికి నితీశ్ కుమార్ వద్దకు చేరింది. దీనిపై నితీశ్ మాట్లాడుతూ.. పార్టీలో ఇబ్బంది ఉంటే స్వేచ్చగా వెళ్లిపోవాలని పవన్ వర్మకు సూచించారు. ఆయన పార్టీ మారితే తాము ఆపమని, కలుగజేసుకొని బతిమిలాడమని చెప్పారు.
పర్సనల్గా కలిస్తే..
పార్టీలో విధానపరమైన అంశాలు, రాజకీయ పరమైన ఇష్యూ ఉంటే తనను వ్యక్తిగతంగా కలిసి మాట్లాడితే బాగుండేదని నితీశ్ కుమార్ సూచించారు. తనతో గానీ, పార్టీ సమావేశంలో మాట్లాడితే బాగుండేదన్నారు. కానీ లేఖ రాసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటే.. ఉండటం దేనికి.. స్వేచ్ఛగా వెళ్లిపోవాలని సూచించారు. తనకు ఇష్టమైన పార్టీలో చేరానలి సజెస్ట్ చేశారు. పవన్ వర్మకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు అని నితీశ్ కుమార్ చెప్పారు.
సోషల్ మీడియాలో వైరల్
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై స్పష్టత ఇవ్వాలని మంగళవారం పవన్ వర్మ లేఖ రాశారు. సిద్ధాంతపరంగా విభేదించే తాము ఎలా కలిసి పనిచేస్తామని అందులో పేర్కొన్నారు. అయితే ఆ లేఖను సోషల్ మీడియోలో షేర్ చేయడంతో వైరలైంది. అంతేకాదు బీజేపీ నాయకత్వం ఎలా అవమానించిందోనని తనతో చెప్పుకున్న విషయాన్ని పవన్ వర్మ ప్రస్తావించారు. దేశానికి బీజేపీ ప్రమాదకరమని మీరు అంగీకరించి.. ఇప్పుడు ఎలా కలిసి పనిచేస్తారని పేర్కొంటున్నారని తెలిపారు.
వ్యవస్థలపై దాడి
అంతేకాదు వ్యవస్థలపై బీజేపీ ఎలా దాడులు చేస్తుందని అని కూడా ప్రస్తావించారు. ఆయా అంశాలను ప్రస్తావిస్తూ పవన్ వర్మ రాసిన లేఖపై నితీశ్ కుమార్ స్పందించారు. ప్రజల అభిమతం ఆధారంగా పార్టీ నడిచి పనిచేస్తుందని, ఇష్టం ఉన్న వాళ్లు ఉంటారని, విభేదించేవారు వెళ్లిపోతారని నితీశ్ కుమార్ కుండబద్దలు కొట్టీ మరీ చెప్పారు.